ఆ భూముల కబ్జాల వెనుక ఉన్నదెవరు.?

by  |
ఆ భూముల కబ్జాల వెనుక ఉన్నదెవరు.?
X

ఆ ప్రభుత్వ కళాశాల భూముల‌పై అధికార పార్టీ నేతలు కన్నేశారా.. కోట్లు విలువ చేసే భూముల కబ్జాల వెనుక ఉన్నదెవరు? కబ్జాలో ఆ ముగ్గురు నేతల హస్తం ఉందంటూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? తదితరాలపై సర్కారు దృష్టి పెట్టింది. వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిఘా వర్గాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల కబ్జాపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. 1964లో కొందరు పెద్దలు కలిసి మంచి ఉద్దేశంతో కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి.. ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల స్థాపించారు. దీనికోసం అక్కడి రైతుల నుంచి 262 ఎకరాలు సేకరించారు. కొంత స్థలంలో రెండు అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించి రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులతో విద్యా బోధన ప్రారంభించారు. విద్యార్థుల ఉద్యమాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడితో సొసైటీ నుంచి కళాశాలను సర్కారు స్వాధీనం చేసుకుంది. కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. ఆస్తుల వివాదం అలాగే ఉండిపోయింది. 262 ఎకరాల భూముల్లో పలు విద్యాసంస్థలు, హాస్టళ్లు, స్టేడియం, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాగా.. 2017లో 158 ఎకరాల ఖాళీ భూములను ప్రభుత్వానికి కాలేజీ ఎడ్యుకేషన్ కమిటీ అప్పగించింది. వీటిని కళాశాల పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లా కేంద్రంగా మారడం, జాతీయ రహదారి పక్కనే వందల ఎకరాల్లో కళాశాల భూములు ఉండటంతో ఆ భూముల కబ్జాకు కొందరు పెద్దలు స్కెచ్ వేశారు.

కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల విలువ కోట్లలో ఉంటుంది. ఎలాగైనా ఆ భూములను కొట్టేయాలని ప్లాన్ వేసిన స్థానిక నేతలు రియల్టర్లతో చేతులు కలిపి 2.5 ఎకరాలు కబ్జా చేశారు. భూములు చదును చేసి అమ్ముతున్నారు. మరో 8 ఎకరాల భూమి సైతం వివాదంలో నెట్టారు. ఇలా మొత్తం 10 ఎకరాల భూమిని కబ్జా లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కబ్జాపై ఫిర్యాదులు చేస్తే అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. భూముల కబ్జాలో ముగ్గురు అధికార పార్టీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే విషయమై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ మాత్రం మౌనమే తమ సమాధానం అంటోంది. అధికార పార్టీ మౌనం వెనుక ఆ ముగ్గురు చక్రం తిప్పుతున్నారనే ప్రచారం ఉన్నా తెర వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరన్నది తేలడం లేదు. కబ్జాలపై ఆందోళనలు జరుగుతున్న ప్రతిసారి సర్వే చేయడం, మధ్యలో ఆపేయడం వెనుక రాష్ట్ర స్థాయి పెద్దల ఒత్తిడి ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ భూవివాదంపై సర్కార్ దృష్టి పెట్టిందని కళాశాల భూముల జోళికెళ్లొద్దంటూ కొందరు నేతలకు గట్టిగా వార్నింగ్ కూడా వచ్చిందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ ముగ్గురు నేతల తీరుపై సర్కారు గుర్రుగా ఉందని సమాచారం. భూముల కబ్జాపై ఆ ముగ్గురి పాత్ర ఏ మేరకు ఉందో తేల్చాలని నిఘా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

Next Story