తెలంగాణలో అమ్మకానికి ప్రభుత్వ ఆస్తులు

by  |
Lands for Sale
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్​డౌన్​ పరిస్థితులు ప్రభుత్వానికి అవకాశంగా మారాయి. ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న భూముల అమ్మకానికి సరైన సమయం దొరికినట్లైంది. ప్రభుత్వ పరిధిలోని భూములు, గృహ నిర్మాణ సంస్థ పరిధిలోని భూములు, ఇండ్ల అమ్మకానికి రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేబినెట్​ ఎజెండాలను బయటకు ఇచ్చినా… ఈ భూముల విక్రయాలను మాత్రం రహస్యంగా దాచి పెట్టారు. ఎట్టికేలకు కేబినెట్​ నిర్ణయాల్లో ఆఖరున ఈ విషయాన్ని ఒకే వ్యాఖ్యంలో వెల్లడించారు. దీంతో ప్రభుత్వ స్కెచ్​ బట్టబయలైంది.

కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనే కారణంతో ప్రభుత్వం చేతిలో ఉన్న భూములను అమ్మకానికి పెడుతున్నారు. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులోని పెద్దలంతా ఈ భూముల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు మంత్రులు, కొంతమంది ఎంపీలు ఈ భూముల్లో పాగా వేసి ఉన్నారు. ప్రభుత్వం అమ్మకాలు మొదలుపెట్టగానే మార్కెట్​ ధరలకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇక వారికి రెడ్​ కార్పెట్​ పరిచినట్టే.

910 ఎకరాలు… రూ. 60 వేల కోట్లు… ఇది ప్రాథమిక నివేదికే

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములతో పాటుగా హౌసింగ్​ బోర్డు భూములు, ఇండ్ల అమ్మకానికి అంతా సిద్ధమైనట్లే కనిపిస్తోంది. దశాబ్ధాల కిందట రైతుల నుంచి సేకరించుకుని, గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో పెట్టుకున్న భూములను ఇప్పుడు కోట్లకు వేలం వేయనున్నారు. ప్రస్తుత నివేదికల ప్రకారం గృహ నిర్మాణ శాఖ పరిధిలోనే 910 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనే వీటి అమ్మకాలకు సిద్ధం చేసుకున్నా… కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటిని వాయిదా వేసుకుంది. అదే ప్రభుత్వానికి ఇప్పుడు కలిసి వస్తోంది.

2020–21 బడ్జెట్​ సందర్భంగా ఈ భూములను అమ్ముతామని దాదాపు రూ. 40 వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ భూముల విలువ పెరుగడంతో దాదాపు రూ. 60 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రాథమికంగా అంచనా వేశారు.ఈ భూముల్లో దాదాపుగా 839 ఎకరాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. అవి ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారాయి. హైదరాబాద్​, రంగారెడ్డి చుట్టూరా ఉన్న ఈ హౌసింగ్​ బోర్డు భూముల అమ్మకాలపై ఈసారి రూ. 50 వేల కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. వీటితో పాటుగా వరంగల్​, నల్గొండ, కరీంనగర్​, ఖమ్మం, మెదక్​ వంటి ఉమ్మడి జిల్లాల పరిధిలో మిగిలిన భూమి ఉంది. అక్కడ ఉన్న భూమి ద్వారా సుమారు రూ. 10 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

కేవలం హౌసింగ్​ బోర్డు భూముల ద్వారానే ఈ ఆదాయం వస్తుందని అధికారులు చెప్పుతున్నారు. ఇంకా హైదరాబాద్​ చుట్టూరా ప్రభుత్వ భూములు, హౌసింగ్​ బోర్డు ఇండ్లు ఉన్నాయి. రాజీవ్​ స్వగృహ పేరుతో నిర్మించిన ఇండ్లు కూడా అమ్మకుండా ఉన్నాయి. వీటి ద్వారా ఈసారి ప్రభుత్వానికి భారీ ఆదాయమే రానుంది.

పెద్దల కనుసన్నల్లోనే..!

ప్రభుత్వ భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల దగ్గర పెద్ద జాబితానే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల వివరాలను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు దగ్గర పూర్తిస్థాయి రిపోర్టు ఉంది. ఓ మంత్రికి చెందిన పలు సంస్థల నిర్మాణాల పక్కనే తన భూమి ఉండటంతో కలిసి వస్తుందని, దీంతో వందల ఎకరాల్లో విద్యా సంస్థను నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక్కడ హౌసింగ్​బోర్డుకు సంబంధించిన దాదాపు 110 ఎకరాల కోసం ఎదురుచూస్తున్నారు. మరో ఎంపీ కూడా 20 ఎకరాల హౌసింగ్​ బోర్డు భూమి కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు. గతంలో ఓ ఇండస్ట్రీకి చెందిన భూమిని కొనుగోలు చేసిన సదరు ఎంపీ… పక్కనే ఉన్న హౌసింగ్​ బోర్డు భూమిని కొని, అతిపెద్ద వెంచర్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం వేలానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ భూముల కోసం ఎవరూ పోటీ రావద్దంటూ గతంలోనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

మొత్తానికి అమ్మేస్తున్నారు

రాష్ట్రంలో భూ వ్యవహారంలో ఇటీవల ఈటల రాజేందర్​ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేశారు. ఈ పరిణామాల్లో దేవరయాంజల్​, హకీంపేట ప్రాంతాల్లో భూముల ఆక్రమణలపై కాంగ్రెస్​ నేతలు పోరాటం చేశారు. మంత్రి కేటీఆర్​, మంత్రి మల్లారెడ్డికి బినామీల పేరుతో భూములున్నాయని కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు. కానీ ఈటల వ్యవహారంలో ఈ ఆరోపణలన్నీ మట్టిలో కలిశాయి. తాజాగా రాష్ట్ర కేబినెట్​ ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎక్కడైతే వివాదాలు నడుస్తున్నాయో… అలాంటి ప్రాంతాలకు సమీపంలో కూడా ప్రభుత్వ భూములున్నాయి. ఇప్పటికైతే ఈటల రాజేందర్​ను భూ వివాదాల నేపథ్యంలో బయటకు పంపించగా… కొంతమందికి ప్రభుత్వ భూములను సక్రమం చేసేందుకు అమ్మకాలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed