అందరికీ ఉచితంగా గూగుల్ మీట్

by  |
అందరికీ ఉచితంగా గూగుల్ మీట్
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనా విజృంభించడంతో.. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్ వేళ.. ఉద్యోగుల నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఎక్కువగా జూమ్ యాప్‌ను వినియోగించారు. అయితే భద్రత కారణాల దృష్ట్యా, జూమ్ యాప్ అంతగా శ్రేయస్కరం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో జూమ్‌కు ప్రత్యామ్నాయంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. తన హ్యాంగ్ అవుట్ మీట్‌ను మార్చి గూగుల్ మీట్‌గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గూగుల్ మీట్‌ను అందరూ ఉచితంగా వాడుకోవచ్చని, తాజాగా గూగుల్ పేర్కొంది. దీంతో గూగుల్ మీట్‌ అధికారికంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది.

కరోనా కాలంలో వీడియో కాల్ సమావేశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త సర్వీస్ గూగుల్ మీట్‌.. ‘ఆన్ లైన్ వీడియో మీటింగ్ ’ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్‌ను ఎవరైనా సరే జీ మెయిల్ అకౌంట్ ద్వారా ఫ్రీగా పొందొచ్చు. గూగుల్ మీట్‌లో వీడియో మీటింగ్స్‌ను ఒకేసారి 100 మందితో 24 గంటలపాటు చేసుకోవచ్చు.

ఫీచర్స్ :

– బేసిక్ షెడ్యూలింగ్, స్క్రీన్ షేరింగ్
– స్క్రీన్‌లో ఒకేసారి 16 మందిని చూడొచ్చు.
– లైటింగ్ సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా వీడియోలో స్పష్టత ఉంటుంది.
– మీటింగ్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను ఇతరులకు షేర్ చేసుకునేందుకు వీలుగా ‘ప్రజెంట్ ఏ క్రోమ్ ట్యాబ్’ సదుపాయం తీసుకొచ్చారు.
– జీ సూట్ వినియోగదారులకు అడ్వాన్స్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
– వీడియో, ఆడియోలో వాయిస్ స్పష్టంగా వినపడేందుకు ‘నాయిస్ కాన్సిలేషన్స్’ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది.

వీడియో కాల్ ఎలా చేయాలి :

– జీ సూట్ యూజర్ అయితే.. జీ సూట్ అకౌంట్లో మొదట లాగిన్ కావాలి. ఆ తర్వాత వీడియో కాల్ చేసుకోవచ్చు. జీ సూట్ యూజర్ కాకపోతే.. జీమెయిల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ అయితే కాల్ చేసుకోవచ్చు.
– మీట్ యాప్‌ను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేశాక, ప్లస్ ఐకాన్ మీద స్టార్ట్ మీటింగ్ అని లేదా మీటింగ్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
– పూర్తి వివరాలు నింపిన తర్వాత జాయిన్ మీటింగ్ ఆప్షన్ ద్వారా అందులో జాయిన్ కావచ్చు.
– అంతేకాదు గూగుల్ క్యాలెండర్ సాయంతో మీటింగ్స్‌ను షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు.

గూగుల్ మీట్ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ మీట్‌ ప్లాట్‌ఫామ్‌లో రోజుకు 3 మిలియన్ల మంది వినియోగదారులు చేరుతున్నారని తెలిపారు.



Next Story

Most Viewed