గూగుల్ వైఫై పై జియో గుగ్లీ!

by  |
గూగుల్ వైఫై పై జియో గుగ్లీ!
X

స్టేషన్ ఇన్ ఇండియా ప్రాజెక్టు పేరుతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సర్వీసును గూగుల్ త్వరలో నిలిపివేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇంటర్నెట్ డేటా రేట్లు చౌకగా మారిపోవడంతో ఇండియాతో పాటు నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా ఈ సేవను నిలిపివేయనున్నట్లు సమాచారం.

టెలికాం కంపెనీ రైల్‌టెల్, భారతీయ రైల్వే వారి సౌజన్యంతో గూగుల్ ఈ ఉచిత వైఫై సేవలను 2016లో ముంబై సెంట్రల్ స్టేషన్‌లో మొదటిసారిగా ప్రారంభించింది. అయితే అనుకున్న స్థాయిలో వ్యాపారం నడవకపోవడంతో గూగుల్ దీన్ని ఎత్తివేయబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఇంటర్నెట్ వాడుకున్నందుకు ఎలాంటి డబ్బు చెల్లించకపోయినా, అందులో ప్రకటనలు వేయాలనుకుంటున్న వ్యాపార సంస్థలు మాత్రం ఎంతకొంత గూగుల్‌కి చెల్లించుకోవాలి. కానీ ఇందుకోసం వ్యాపార సంస్థలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అంతేకాకుండా వీటి ఏర్పాటుకు అవుతున్న ఖర్చు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాని కంటే ఎక్కువవుతోంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టేషన్లను మాత్రం కంపెనీలు స్పాన్సర్ చేసి నడిపించుకునే అవకాశం కల్పిస్తామని గూగుల్ తెలిపింది.

అసలు కారణం జియో?

డేటా రేట్లు చౌకగా మారడం వల్లే తాము ఈ ఉచిత వైఫై సేవలు నిలిపివేస్తున్నామని గూగుల్ చెప్పడానికి ప్రధాన కారణం అంబానీ వారి జియో నెట్‌వర్క్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే 350 మిలియన్ల మంది 4జీ నెట్‌వర్క్ వినియోగదారులతో జియో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. చౌక డేటా ధరల కారణంగా వినియోగదారులు వైఫై వాడటం కంటే ఎక్కువగా మొబైల్ ఇంటర్నెట్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇలాంటి ఉచిత వైఫై సేవలకు ప్రాముఖ్యత తగ్గింది.

ఇదిలా ఉండగా ఓవైపు బిల్లులు చెల్లించాలంటూ ఐడియా, వొడాఫోన్ లాంటి టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తుండటం, మరోవైపు గూగుల్ ఉచిత వైఫై సేవలను ఆపేయడం చూస్తుంటే ఇదంతా జియో వారు ప్రభుత్వంతో కలిసి చేస్తున్న పన్నాగమని అనుమానపడుతున్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే కొద్దిరోజులు వాయిస్, డేటా ఉచితంగా ఇచ్చి, ఒక్కసారిగా రేట్లు పెంచేసిన జియో… మెల్లమెల్లగా వారి మీదే ఆధారపడేలా చేయాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు భారత ప్రభుత్వ సహకారం కూడా వారికి ఉందని కొన్ని వర్గాలు అనడం కొసమెరుపు.

Next Story

Most Viewed