గుడ్‌న్యూస్.. రైల్వే బోర్డు వెబ్‌సైట్‌లో విశాఖ రైల్వే జోన్ పేరు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు చకచకా పడుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరే దిశగా కేంద్రంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో 18 రైల్వే జోన్లున్నాయి. వీటితో పాటు దక్షిణకోస్తా (సౌత్‌ కోస్ట్‌) పేరును రైల్వేబోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో జనరల్‌ మేనేజర్ల జాబితాలో చేర్చింది. 13వ [&hellip;]</p>

Visakhapatnam Railway Zone
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు చకచకా పడుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరే దిశగా కేంద్రంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో 18 రైల్వే జోన్లున్నాయి. వీటితో పాటు దక్షిణకోస్తా (సౌత్‌ కోస్ట్‌) పేరును రైల్వేబోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో జనరల్‌ మేనేజర్ల జాబితాలో చేర్చింది. 13వ నంబర్‌లో విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌కోస్ట్ జోన్ ఉన్నట్లు పొందుపరిచింది. దీన్ని బట్టి చూస్తే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు ఖాయమని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కేంద్రం. పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదనకు అడుగులు పడలేదు. దీంతో రైల్వేజోన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగి వచ్చింది. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆందోళనల ఫలితంగా 2019 ఫిబ్రవరి 27న కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తరాంధ్ర వాసుల కల అయిన విశాఖ పట్నం రైల్వే జోన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగాన్ని కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి కొంత భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మిగిలిన భాగాన్ని ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఆ రెండో భాగం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంటుంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయని పీయూష్ గోయల్ తెలిపారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే జోన్‌కు SCOR అని పేరు పెట్టారు. అంటే సౌత్ కోస్ట్ రైల్వే. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అయితే దక్షిణ కోస్తా జోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు రూ.170 కోట్లు మంజూరయ్యాయి. అనంతరం బడ్జెట్ కేటాయింపుల్లో కంటితుడుపుగా నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో రూ.3 కోట్లు, ఈ ఏడాది రూ.40లక్షలు కేటాయించారు. ఈ కేటాయింపులు కేవలం సిబ్బంది జీతభత్యాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో రైల్వేజోన్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కేంద్ర రైల్వే శాఖ సౌత్ కోస్ట్ రైల్వేపై శీతకన్ను వేసిందని అంతా విమర్శించారు.

అయితే తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌, ఒడిశాలోని రాయగడ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంత్రిత్వ శాఖ దగ్గర నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా జోన్ ఏర్పాటుపై కసరత్తు మెుదలైందని తెలుస్తోంది. వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే అందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. పాలన కొనసాగిస్తూ కొత్త భవనాలను నిర్మించుకోవచ్చన్న ఆలోచన కూడా రైల్వేశాఖలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాయగడ డివిజన్ ఏర్పాటుపై కసరత్తు..

సౌత్ కోస్ట్ జోన్‌ ఏర్పడాలంటే రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు కావాలి. అయితే అక్కడ ప్రస్తుతానికి మౌలిక వసతులేమీ లేవు. ఒడిశా ప్రభుత్వం ఒత్తిడితో రాయగడ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి పననులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేస్టేషన్‌కు, యార్డుకు వచ్చి వెళ్లే రైళ్ల రాకపోకలకు సిగ్నళ్లు అందించే కీలక ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (ఈఐ)ను రాయగడలో తీసుకొస్తున్నారు. అధునాతన పరికరాలు నిల్వ చేసేందుకు అవసరమైన భవనాలు సిద్ధం చేస్తున్నారు. రాయగడలో కొత్త డివిజన్‌కు అనుకూలంగా రైళ్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్లాట్‌ఫారాల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఇదివరకు మూడు ప్లాట్‌ఫాంలే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 5కు పెంచుతున్నారు. డివిజన్‌లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్‌పీఎఫ్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగడలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్‌ స్థాయి అధికారుల కార్యాలయాలకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయనగరం నుంచి రాయగడ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వరకు మూడో లైన్ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యే సరికి రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది.

ఇకపోతే రైల్వేశాఖ దక్షిణకోస్తా జోన్‌ అవసరాలకు ప్రత్యేకాధికారిగా ఓఎస్డీని, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం నోడల్‌ అధికారిని నియమించారు. ఆ తర్వాతే జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ను, కొత్త డివిజన్‌కు డీఆర్‌ఎంను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం సిబ్బంది, రైల్వే ఆస్తులు, వనరుల పంపకాలు ఉంటాయని రైల్వేశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే విశాఖకు రైల్వే జీఎం రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది

Next Story