కాంగ్రెస్‌ నేతలకు గుడ్‌న్యూస్.. పీసీసీలో హైలెవల్ కమిటీ

by  |
కాంగ్రెస్‌ నేతలకు గుడ్‌న్యూస్.. పీసీసీలో హైలెవల్ కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందేనని, అసంతృప్తి వ్యక్తం చేసేవారిపట్ల కఠినంగానే వ్యవహరించాలని ఏఐసీసీ భావిస్తున్నది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలోనూ అదే విధానం ఉంటుందని ఏఐసీసీ నేత ఒకరు ఢిల్లీలో శనివారం వ్యాఖ్యానించారు. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే సంప్రదాయం ఇకపైన ఉండదని, ప్రతీ ఒక్కరూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి బద్ధులై ఉండాల్సిందేనని ఫోన్‌ల ద్వారా ఇప్పటికే స్పష్టత ఇచ్చామని, అలకపూనినవారి విషయంలోనూ ఇదే తీరులో వ్యవహరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో పార్టీ పెద్దగా పీసీసీ చీఫ్ అన్ని స్థాయిల్లోని లీడర్లను, కేడర్‌ను కలుపుకుపోవాల్సిందేనని కూడా నొక్కిచెప్పారు.

పార్టీలో ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలికి సమిష్టి నిర్ణయాలు జరగడం, వాటిని అమలు చేయడం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త యంత్రాంగం రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉనికిలోకి రానున్నది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పీసీసీ చీఫ్‌గా తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకుండా సమిష్టిగా ఉండేందుకు సీఎల్పీని కూడా విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేసేలా హై లెవల్ కమిటీ కొత్తగా ఏర్పాటు కానున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ఏ నిర్ణయం జరిగినా సీఎల్పీ భాగస్వామ్యం కూడా ఉంటుందని వివరించారు. ఏ నిర్ణయం జరిగినా పార్టీపరంగా, పార్టీ ప్రయోజనాల కోసమే ఉంటుందని, ఏకపక్ష నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్కకు సైతం కేసీ వేణుగోపాల్ తాజా భేటీ సందర్భంగా వివరించినట్లు తెలిసింది.

మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీ అయ్యారు. భేటీ వివరాలను వెల్లడించడానికి ఇద్దరూ ఆసక్తి చూపలేదు. తెలంగాణలో పార్టీ బలోపేతంపైనా, దళితుల హక్కులు, వారికి జరుగుతున్న అన్యాయంపైన సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క చొరవను మాణిక్కం ఠాగూర్ అభినందించారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో భట్టి తీసుకున్న చొరవను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ‘దళిత్ ఎంపవర్‌మెంట్‘ పథకాన్ని తెరపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ చేసిన పోరాటమే కారణమని ట్విట్టర్ ద్వారా మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాలు, ఇకపైన గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం తదితరాలపై భట్టితో చర్చించినట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ఖరారు చేయడం రాష్ట్రంలోని పార్టీ లీడర్లు, కేడర్ అభిప్రాయాల మేరకు అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమేనని భట్టికి వివరించినట్లు తెలిసింది.


Next Story

Most Viewed