తెలంగాణలో ఉద్యోగులకు గుడ్ న్యూస్..

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మార్చి నుంచి కొనసాగుతున్న పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే పెండింగ్​లోనే ఉంది. దీనిపై ఉద్యోగులు కూడా ఆశలు వదిలేసుకున్నట్టే మాట్లాడుతున్నారు. గత ఏడాది డిసెంబర్​లో పీఆర్సీ ఫైలును ప్రభుత్వానికి ఇవ్వగా… మార్చిలో సీఎం కేసీఆర్​ అసెంబ్లీలోప్రకటన చేసిన విషయం తెలిసిందే. 30 శాతం ఫిట్​మెంట్​ ఇస్తామని ప్రకటించారు. ఏప్రిల్​ నుంచే అమల్లోకి వస్తుందన్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి మార్గదర్శకాలన్నీ రెడీ అయి సీఎం ఆమోదం కోసం పంపించారు. అప్పటి నుంచి ఈ ఫైల్​ పెండింగ్​ పడింది. కొన్ని సందర్భాల్లో ఇవ్వాళ పీఆర్సీ… రేపు జీవోలు అంటూ ప్రచారం జరిగినా ఉద్యోగ సంఘాలు మాత్రం కొట్టి పారేస్తూనే ఉన్నాయి.

తాజాగా కేబినెట్​ ముందుకు…?

రాష్ట్ర మంత్రివర్గం సమావేశం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రగతిభవన్​ నుంచి ఈ లీకులిచ్చారు. అప్పటికే పీఆర్సీపై ఆశలు పెట్టి వదిలేశారంటూ సోషల్​ మీడియాలో విస్తృత ట్రోలింగ్​ జరుగుతోంది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని గుర్తించి కేబినెట్​ ముందు పెట్టి, ఆమోదం తెలిపి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని తర్వాత కూడా జీవోలు ఎప్పుడు వస్తాయనేదానిపై క్లారిటీ రావడం లేదు. కేబినెట్​ ఆమోదం తర్వాత జీవోలు వస్తాయనే అంశంపై సచివాలయ వర్గాలు కూడా నిర్ధారించడం లేదు.

మాకైతే నమ్మకం లేదయ్యా…!

ఇక పీఆర్సీ ఫైల్​ అంశంలో ఉద్యోగ సంఘాలు సినిమా డైలాగులన్నీ పేల్చుతున్నారు… లీడర్​ సినిమాలో మాదిరిగా… “ సీఎం అసెంబ్లీలోనే ప్రకటించారు… మాట తప్పితే తల నరుక్కుంటానన్న సీఎం సంతకం పెట్టలేదు… ఏమో సామీ… మాకైతే నమ్మకం లేదు” అంటూ సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు టీఆర్​ఎస్​ వర్గాలు మాత్రం మంగళవారం కచ్చితంగా ఉత్తర్వులు వస్తాయంటున్నా… ఉద్యోగ సంఘాలు మాత్రం కొట్టిపారేస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాకుండా కొంతకాలం కిందట వరకూ పీఆర్సీ ఫైల్​ వస్తుందంటూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు మాకైతే క్లారిటీ లేదని, కేబినెట్​లో ఆమోదించినా… జీవోలు వస్తాయనే నమ్మకం లేదని, ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేమంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఆదాయం తగ్గిన నేపథ్యంలో జీవోలు వస్తాయనే ఆశలు లేవని, వస్తే మాత్రం బోనస్​ అంటూ చెప్పుతున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్​ ప్రకటించిన విధంగా పీఆర్సీపై జీవోలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి డిమాండ్​ చేశారు. దీనిపై ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. పీఆర్సీని ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు జీవోలు రాకుంటే ఉద్యమం చేస్తామని, ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed