వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత కేసీఆర్‌ది: గోనె ప్రకాశ్

by  |
వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత కేసీఆర్‌ది: గోనె ప్రకాశ్
X

దిశ, కరీంనగర్ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నియంతృత్వ పాలన కొనసాగుతోందని, ఏడున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు. డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కేసీఆర్ వైఖరి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల బయోడేటాను చూసి టిక్కెట్లు ఇవ్వకుండా, వారి బ్యాలెన్స్ సీట్లను చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అందుకే బ్యాలన్స్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు కాంగ్రెస్ ఉన్నత స్థాయిని కల్పించిందని, పార్టీ పేరుతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాడని, కానీ కాంగ్రెసుకు మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. వేములవాడ ఉపఎన్నిక వస్తే అక్కడి నుండి పోటీ చేసేందుకే టీఆర్ఎస్‌లో చేరాడని, కోట్లు ఖర్చు పెట్టె స్థాయి ఆయనకే ఉందని, అందుకే టీఆర్ఎస్ కూడా టికెటిస్తుందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి, బలవంతంగా తమ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తోందని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఉద్యమకారుడైన రవీందర్ సింగ్‌‌కు ఒకటో నెంబరు ప్రిపరేషన్ ఓటు వేసి, రెండవది మీ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed