కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఎంపీ సంతోష్ రావు.. సంచలన వ్యాఖ్యలు

by  |
Mp-santhosh-rao
X

దిశ, కరీంనగర్ సిటీ : అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతుంటే, ప్రశ్నించిన వారిని బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేస్తూ, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నాడని, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మన్వాడలో తన కుటుంబం చేస్తున్న అక్రమ ఇసుక దందాతో నష్టపోతున్న అమాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హేయనీయం అని అన్నారు. నాడు కుటుంబం గడిచేందుకే కష్టమైన రవీందర్ రావు నేడు వేల కోట్లు సంపాదించి, కొదురుపాక పరిసర గ్రామాల ప్రజల ఉసురు తీస్తున్నాడని ధ్వజమెత్తారు.

తాను చేస్తున్న అక్రమ దందాకు సహకరించడం లేదంటూ 30 మందిపై అట్రాసిటీ కేసులు బనాయించారని మండిపడ్డారు. అధికారం మీద కాంక్షతో కుటుంబ సభ్యులను సైతం విడదీసి ఫామ్ హౌస్‌లో పెత్తనం సాగిస్తున్న సంతోష్ రావు.. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గ్రీన్ ఛాలెంజ్ పేర మొక్కలు నాటుతూ.. జిల్లాలు పర్యటిస్తున్నారని అన్నారు. నిన్నమొన్నటిదాకా హరీశ్ రావు, కేటీఆర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉండగా, తాజాగా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందన్నారు.

కేటీఆర్ , కవిత కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందే..

ఫామ్ హౌస్‌కు రావాలంటే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా సంతోష్ రావు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు కల్పించాడని, రోజుల తరబడి వేచి చూసినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రకాశ్ రావు ఆరోపించారు. ఇలా ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు, కూతురుకు మధ్య అగాధం పెంచుతున్నాడని అన్నారు. ఇంటలిజెన్స్ వ్యవస్థను కూడా శాసిస్తున్న ఎంపీ సంతోష్.. భూ నిర్వాసితుల కోటాలో తాను, తన తండ్రి వ్యవసాయ కూలీ కింద రూ.2 లక్షల చొప్పున లబ్ది పొందటంతో పాటు, తన బాబాయ్ గండ్ర రమణా రావు, కూతురు సౌమ్యలకు కూడా రూ.53 వేల చొప్పున లబ్ది చేకూర్చాడని విమర్శించారు.

ముంపునకు గురైన గ్రామాల్లో 4,231 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం ఆయన సూచించిన 100 మందికి మాత్రమే వచ్చిందని, మిగతా వారంతా ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన్వాడ నుంచి నిత్యం 150 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా, ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు 13 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తూ, అనధికారిక ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నాడని అన్నారు. తండ్రి, కొడుకుల అవినీతిని ఆధారాలతో రుజువు చేసి, జైలుకు పంపిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్రమ రవాణాపై దృష్టి సారించాలని, ఇసుక టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Gone-prakash-Rao



Next Story

Most Viewed