బ్యాంకుల్లో పేరుకుపోతున్న బంగారం రుణాల బకాయిలు!

by  |
gold loan
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 కారణంగా భారీగా ఉపాధి నష్టం, జీతాల తగ్గింపు, ఆరోగ్యంపై పెరిగిన ఖర్చుల కారణంగా బంగారం రుణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు బంగారంపై తీసుకున్న అప్పులను చెల్లించలేక బ్యాంకుల నుంచి బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారు. దీంతో సాధారణ రుణాల స్థాయిలో బంగారం రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు ఫెడరల్ బ్యాంకు సహా ఇతర బ్యాంకుల్లో బంగారం రుణా బకాయిలు అధికంగా ఉన్నాయని సమాచారం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు బంగారు రుణాలు తీసుకున్న వారికి తిరిగి చెల్లించే సమయాన్ని పొడిగించింది. బంగారు రుణాల్లో ఎక్కువ భాగం తిరిగి చెల్లించేస్తారు. అయితే సెకెండ్ వేవ్ కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో రుణాల బకాయిల ప్రక్రియ సరిగా జరగలేదు. కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో బకాయిల వసూలుకు బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రస్తుత ఏడాది మొదటి సగంలో బంగారం రుణ విభాగంలో మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచేందుకు బంగారం వేలం నిర్వహించారు. రికార్డు స్థాయిలో 1 టన్ను, రూ. 404 కోట్ల బంగారాన్ని వేలం వేసినట్టు మనప్పురం ఫైనాన్స్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలిచ్చిన సంస్థలు బంగారాన్ని తక్కువ ధరకే వేలం వేయవల్సి వచ్చినట్టు సంస్థ అభిప్రాయపడింది. ఇదే సమయంలో బ్యాంకులు బంగారం రుణాల విషయంలో మరో రెండు త్రైమాసికాల పాటు ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ అన్నారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది మార్చి చివరి నాటికి బంగారం రుణాలు రెట్టింపు స్థాయిలో పెరిగి రూ. 60,464 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఈ రకమైన రుణాలు రూ. 26,192 కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బంగారం రుణాలు 6 రెట్లు పెరిగి రూ. 20,987 కోట్లుగా ఉన్నాయి.

Next Story

Most Viewed