తగ్గిన బంగారం దిగుమతులు

by  |
తగ్గిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో బంగారం దిగుమతులు 3.3 శాతం తగ్గి సుమారు రూ. 1.90 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. 2019-20 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో దిగుమతులు రూ. 1.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతుల క్షీణతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో దేశ వాణిజ్య లోటును రూ. 6.17 లక్షల కోట్లకు తగ్గించేందుకు దోహదపడింది. ఏడాది క్రితం ఇది రూ. 11 లక్షల కోట్లుగా ఉండేది. దేశీయంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చేందుకు భారత్ ప్రతి ఏటా అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. పరిమాణం పరంగా దేశీయంగా ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది.

కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించడానికి బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఇక, సమీక్షించిన కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 33.86 శాతం క్షీణించి రూ. 1.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే బంగారం దిగుమతులు రూ. 38.6 వేల కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ. 17.22 వేల కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన కాలంలో వెండి దిగుమతులు సైతం 70.3 శాతం తగ్గి రూ. 5,327 కోట్లకు చేరుకున్నాయి.



Next Story

Most Viewed