భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

by  |
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో 57 శాతం క్షీణించి సుమారు రూ. 50,658 కోట్లకు పడిపోయాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ పడిపోయిందని, గతేడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు సుమారు రూ. 1,10,259 కోట్లుగా నమోదైనట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అదేవిధంగా, 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో వెండి దిగుమతులు కూడా 63.4 శాతం తగ్గి సుమారు రూ. 5,543 కోట్లుగా నమోదయ్యాయి. బంగారం, వెండి దిగుమతుల క్షీణత దేశ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడింది. 2020-21 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం సుమారు రూ. 1.71 లక్షల కోట్లు ఉండగా, గతేడాది ఇదే కాలంలో ఇది సుమారు రూ. 6.49 లక్షల కోట్లుగా ఉండేది.

భారత్‌లో ఆభరణాలకున్న డిమాండ్‌ను బట్టి ఏటా అత్యధిక బంగారం దిగుమతి అవుతోంది. వాల్యుమ్ పరంగా దేశంలో ప్రతి ఏటా 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-సెప్టెమర్ మధ్య కాలంలో 55 శాతం వరకు తగ్గి సుమారు రూ. 63.5 వేల కోట్లకు చేరుకున్నాయి.


Next Story

Most Viewed