23 ఏళ్లలో.. 28 ట్రిలియన్ టన్నుల ఐస్ లాస్

by  |
23 ఏళ్లలో.. 28 ట్రిలియన్ టన్నుల ఐస్ లాస్
X

దిశ, వెబ్‌డెస్క్: మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యంతో పాటు మానవుల విధ్వంసక చర్యలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కాగా, భారీ వాతావరణ మార్పులను నివారించడం మనుషుల చేతిలో పనే అని లాక్‌డౌన్ స్పష్టం చేసింది. అయినా మానవుడు కళ్లు తెరవడం లేదు. ప్రకృతికి మరింత విఘాతం కలిగిస్తూ ముప్పును కొనితెచ్చుకుంటున్నాడు. భూమిపైన ఉండే చెట్లలో సగం మాయమయ్యాయి. జీవజాతులు అంతరించిపోవడం అనేది చాలా మామూలు విషయంలా మారిపోయింది. ఇలా ప్రకృతి వినాశనం, కాలుష్యం వల్ల ‘గ్లోబల్ వార్మింగ్’ రెట్టింపు స్థాయిలో పెరిగిపోతోంది. దాంతో ఒకప్పటితో పోల్చితే, చాలా వేగంగా ‘మంచు’ అంతర్థానమైపోయిందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి.

భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో ఉన్న మంచుదిబ్బలు గణనీయ స్థాయిలో కరిగిపోతూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు దశాబ్దాల్లో భూమి వేగంగా మంచును కోల్పోతోందని క్రియోస్పియర్ జర్నల్‌లో ప్రచురితమైన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్(బ్రిటన్) అధ్యయనం వెల్లడించింది. 1994-2017 మధ్య కాలంలో ఏకంగా 28 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని తేలింది. శాటిటైల్ చిత్రాల విశ్లేషణ ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. 1990ల్లో భూమి ఏడాదికి ఏటా 0.8 ట్రిలియన్ టన్నుల మంచును నష్టపోతే, ప్రస్తుతం ఈ సంఖ్య 1.3 ట్రిలియన్ టన్నులకు చేరుకుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు వేగంగా కరిగిపోతుండటంతో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు ముంపు ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని, ఆయా ప్రాంతాల్లో నివసించే వన్యప్రాణాలు తమ ఆవాసాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ప్రకృతి ధ్వంసమవుతుందని, ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఉత్తర, దక్షిణ ధృవాల్లోని పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన థామస్ స్లేటర్ హెచ్చరించారు. పర్వత హిమానీనదాల మంచు నష్టం, వార్షిక మంచు నష్టం మొత్తంలో 22% గా ఉంది, ఇది భూమి పైన ఉన్న మొత్తం మంచులో 1% మాత్రమే ఉందని, మంచు కరగడానికి ప్రధాన కారణం ‘గ్లోబల్ వార్మింగ్’ అని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed