అమ్మాయిలు ఆ రూంలోకి వెళ్లగానే కోతులు వెనకాలే వెళ్లి..

by  |
అమ్మాయిలు ఆ రూంలోకి వెళ్లగానే కోతులు వెనకాలే వెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య అవ్వి అడవుల్లో కంటే ఇండ్లల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. వానరాలు వస్తున్నాయంటేనే వామ్మో అంటూ ప్రజలు పరుగులు తీస్తున్నారు. కోతులు ఇండ్లనే కాదు.. పాఠశాలలు.. కళాశాలలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. టీచర్లకు విద్యార్థుల గోల ఏమోగాని కోతుల గోలను భరించలేకపోతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటపల్లి గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీ వానర మూకకు ఆవాసంగా మారింది. కరోనా వల్ల ఐదారు నెలలుగా కాలేజీ మూతబడి ఉండడంతో కోతులు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా ఫిబ్రవరిలో కాలేజీలు ఓపెన్ చేయడంతో విద్యార్థినులు క్లాసులకు హాజరవుతున్నారు. అయితే విద్యార్థినులు తెచ్చుకుంటున్న టిఫిన్ బాక్స్‌లు, పౌచులు, బ్యాగులను కోతులు ఎత్తుకెళ్తున్నాయి. విద్యార్థినులు క్లాస్ రూంలోకి వెళ్లి బ్యాగులు, టిఫిన్ (అన్నం) బ్యాక్సులు అలా పెట్టగానే కోతులు మూకుమ్మడిగా వచ్చి వాటిని ఎత్తుకెళ్లి తింటున్నాయి. క్లాస్ రూముల్లో బెంచీలను, బుక్స్‌లను చిందరవందర చేస్తున్నాయి. వాటర్ బాటిళ్లను సైతం ఎత్తుకెళ్లి బయటపడేస్తున్నాయి. దీంతో అమ్మాయిలు కోతులను చూసి భయపడుతున్నారు.

కోతుల బెడదను నివారించాలని కాలేజీ లెక్చరర్లు, అటవీశాఖ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాలేజీ ప్రారంభం అయినప్పటి నుంచి కోతులతో వేగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్‌లు జరగుతున్న సమయంలోనూ రూముల్లోకి వచ్చి గలాట సృష్టిస్తున్నాయని, విద్యార్థినులను బెదిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల బాలికలు కాలేజీకి రావడాకి భయపడుతున్నారని వాపోతున్నారు.


Next Story