బావతో పెళ్లన్నారు.. తరువాత కాదన్నారు… దీంతో బాలిక..!

by  |
బావతో పెళ్లన్నారు.. తరువాత కాదన్నారు… దీంతో బాలిక..!
X

దిశ, పటాన్ చెరు: ఇంట్లోవాళ్లు మేనబావతో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు..ఇంతలో మళ్లీ వద్దనుకున్నారు…దీంతో మనస్థాపం చెందిన బాలిక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతురాలు నాగులపల్లి పూజిత (14) తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుండి తను, ఆమె చెల్లెలు ఇరువురు కూడా వాళ్ళ తాత-అమ్మమ్మ, లంక సత్యనారాయణ, సూర్యావతి లతో కలిసి ముత్తంగిలో నివాసముంటున్నారు. పూజిత సంగారెడ్డి గురుకుల హాస్టల్‌లో 8వ తరగతి చదువుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఇంటి వద్ద ఉంటుంది.

అయితే గత కొంతకాలంగా పూజితను తన మేనబావ సాయిబాబాకు ఇచ్చి పెళ్లి చేసే ఆలోచనలో కుటుంబీకులు ఉండటంతో, పూజిత తన మేనబావ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య తన మేనబావ తాగుడుకు బానిసవడంతో ఇంట్లో వారు అతనితో పెళ్లి రద్దు చేద్దామని నిశ్చయించారు. అప్పటి నుండి పూజిత తనలో తాను బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి ముందు గల స్క్రాప్‌షాప్‌లో ఇనుప రాడ్డుకు తన చున్నీతో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన పూజిత చెల్లెలు వర్షిని ఇంట్లో వారికి తెలుపగా వెంటనే మృతురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పూజితను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి అమ్మమ్మ సూర్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ ప్రసాద్ రావు పేర్కొన్నారు.



Next Story

Most Viewed