జీహెచ్ఎంసీ ర్యాంక్‌ను తగ్గించింది అందుకే..!

by  |
జీహెచ్ఎంసీ ర్యాంక్‌ను తగ్గించింది అందుకే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ దురుద్దేశంతోనే హైదరాబాద్ ర్యాంకింగ్‌ను కేంద్రం తగ్గించిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరోపించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన సులభతర నివాస యోగ్య నగరాల్లో హైదరాబాద్ నగరానికి ప్రకటించిన ర్యాంకుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా హైదరాబాద్ నగరం అభివృద్ధి, మౌళిక వసతుల కల్పనలో ముందంజలో ఉందన్నారు. కానీ కేంద్రం హైదరాబాద్‌కు 24‌వ ర్యాంకు ఇవ్వడం నగర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తెలిపారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు హైదరాబాద్‌కు ఉన్నాయని పలు అంతర్జాతీయ సర్వేసంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ర్యాంకింగ్‌లో జీవన ప్రమాణాలకు కేవలం 35 శాతం మార్కులు మాత్రమే ఇచ్చారని, ఆర్థిక ప్రమాణాలకు 15శాతం మార్కులు ఇవ్వడంలో ఉద్ధేశం ఏంటని ప్రశ్నించారు.

కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్‌లో విశ్వసనీయత లోపించిందని, మింట్ అనే జాతీయ దినపత్రిక సైతం ర్యాంకింగ్‌ను తప్పుపట్టిందని గుర్తుచేశారు. దేశంలోని 111 నగరాలను ఇందుకు ఎంచుకున్నారని తెలిపారు. సులభతర జీవనం రాంకింగ్‌లో పది లక్షల కన్నా అధిక జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై నగరాలు మొదటి నుంచి వరుస స్థానాల్లో నిలవగా, పదిలక్షల లోపు జనాభా నగరాల్లో షిమ్లా , భువనేశ్వర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. జేఎల్ఎల్, మెర్సర్స్ లాంటి సంస్థలు హైదరాబాద్ ఉత్తమ నివాసయోగ్యమైన నగరమని ఐదేళ్లుగా వరుసగా ప్రకటించాయని తెలిపారు. కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా ర్యాంకు ఇచ్చిందన్నారు. మెరుగైన రవాణా, సిగ్నల్ ఫ్రీ రహదారుల ఏర్పాటుకు ఎస్ఆర్డీపీల ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. 2018 లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలు ప్రస్తుతం 225‌కు పైగా పనిచేస్తున్నాయని, ప్రతి దవాఖానాలో నిత్యం సుమారు 80 నుంచి 90 మంది ప్రాథమిక చికిత్స కోసం వస్తున్నారని వెల్లడించారు.


Next Story

Most Viewed