హఫీజ్‌‌పేట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

by  |
హఫీజ్‌‌పేట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత
X

దిశ, శేరిలింగంపల్లి: హఫీజ్‌‌పేట్‌లోని మార్తాండనగర్‌‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. గతంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఎస్టీఎఫ్‌ (స్పెషల్ టాస్క్‌ ఫోర్స్​‍) సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు బందోబస్తు నడుమ 14 క్రషర్ల సహాయంతో 4 బహుళ అంతస్థుల భవనాలను కూల్చారు. మిగతా అక్రమ నిర్మాణాలను సైతం త్వరలోనే కూలుస్తామని జీహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. అయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ నేతృత్వంలోనూ నామమాత్రంగా నిర్మాణాలను కూలుస్తూ మమా అనిపిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇలా ఏదో ఒక డివిజన్‎లో కాదు దాదాపు శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు నిర్మాణాలు సాగేప్పుడు చోద్యం చూస్తున్న టీపీఎస్ సిబ్బంది తీరా నిర్మాణాలు పూర్తయ్యాక ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లేదాక ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని వెనకా టీపీఎస్ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి సిబ్బంది నుండి మొదలు ఉన్నతాధికారుల వరకు అక్రమార్కులకు సహకరిస్తున్నారని అందుకే యదేచ్ఛగా అక్రమ కట్టడాలు సాగుతున్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story