జీహెచ్ఎంసీలో తిష్టవేశారు.. గడువు ముగిసినా ఉద్యోగం వదలడం లేదు..!

by  |
జీహెచ్ఎంసీలో తిష్టవేశారు.. గడువు ముగిసినా ఉద్యోగం వదలడం లేదు..!
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో పోస్టింగ్ అంటేనే అధికారులు సంతోషపడుతారు. ఒక్కసారి ఇందులోకి వచ్చారంటే మళ్లీ తిరిగి వెళ్లేందుకు ఇష్టపడరు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న 16 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లలోఎక్కువ మంది తమ డిప్యూటేషన్ గడువు ముగిసినా సీట్లను వదలం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సర్కారు ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డిప్యూటేషన్ గడువు మూడేళ్లు మాత్రమే. ఆ గడువు ముగిసిన తర్వాత సర్కారు అనుమతిస్తే మరో ఏడాది పాటు ఇక్కడే సేవలందించవచ్చు. లేని పక్షంలో మాతృశాఖకు తిరిగి వెళ్లి, అక్కడ మరో ఏడాది పాటు విధులు నిర్వర్తించి, మళ్లీ ప్రయత్నం చేసుకుని తమకు నచ్చిన విభాగంలో పోస్టు ఖాళీ ఉంటే అక్కడ చేరవచ్చు.

కానీ, ప్రస్తుతమున్న మెడికల్ ఆఫీసర్లలో ఎక్కువ మంది డిప్యూటేషన్ గడువు ముగిసినా, నేటికీ ఇంకా అదే పదవుల్లో కొనసాగుతున్నారు. 60 ఏళ్ల వయస్సు దాటిన స్వీపర్లను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో వారి వారసులను నియమించాల్సి ఉండగా, కొన్ని సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు తమ ఇష్టానుసారంగా నియామకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు రావటంతో మెడికల్ ఆఫీసర్లపై ఉన్నతాధికారుల దృష్టి పడింది. వీరిలో ఎవరెవరు మూడేళ్లు, ఐదేళ్ల డిప్యూటేషన్ గడువును పూర్తి చేసుకున్నారోనన్న వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. వీరిలో మూడేళ్ల గడువు పూర్తి చేసుకున్న వారిని తిరిగి మాతృశాఖకు పంపాలని సిఫార్సు చేస్తూ సర్కారుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. పైగా సర్కిళ్లలో వీరి అరాచకాలపై బాధితులు కొందరు ఇప్పటికే కమిషనర్ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed