ఫిబ్రవరి నుంచి ఓటీపీతోనే రేషన్​

by  |
ఫిబ్రవరి నుంచి ఓటీపీతోనే రేషన్​
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) చెప్పాల్సిందే. లేదంటే ఐరీస్ విధానం ద్వారా మాత్రమే రేషన్ అందజేస్తారు. ఈ మేరకు రేషన్ సరుకులు పొందేవారికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు.

ఫిబ్రవరి నుంచి అమలు..

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే చౌకధరల దుకాణాలకు అదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయిందో కాలేదో చూసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. గతంలో బయోమెట్రిక్ లో వేలిముద్ర వేసిన తర్వాతే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇక నుంచి ఆ అవసరం లేదని, ఫోన్‌కి వచ్చే ఓటీపీ చెబితే సరిపోతుందని పేర్కొంటున్నారు.

రేషన్‌కు ఆధార్ అనుసంధానం

ఇక నుంచి ఆధార్ నంబర్ ను కూడా ప్రమాణికంగా తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆహార భద్రత కార్డులో ఉన్న ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ జిరాక్స్ కాపీని సంబంధిత డీలర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా ఫిబ్రవరి నెల నుంచి ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉండనుంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో 30 శాతం మంది లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఆధార్ తో లింకు కాలేదని సమాచారం. వారందరికీ ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో షాపులు, లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి..

ఓటీపీ లేదా ఐరీస్ తప్పనిసరి: రమేష్, మేడ్చల్ జిల్లా పౌర సంబంధాల అధికారి

రేషన్ సరుకుల పంపిణీకి ఇక మీదట ఓటీపీ లేదా ఐరీస్ తప్పని సరి చేస్తు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేస్తుంది. గతంలోనే బయోమెట్రిక్, ఐరీస్ ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసేది. ఇప్పుడు ఐరీస్ విధానాన్ని కొనసాగిస్తూ బయోమెట్రిక్‎ను పూర్తిగా రద్దు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన విధానాలు అమలులోకి వచ్చాయి. దీంతో ఓటీపీ, ఐరీస్ పద్ధతుల ద్వారానే ఆహార భద్రత కార్డుదారులకు సరుకులు అందజేస్తాం.


Next Story

Most Viewed