భారత ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన జర్మనీ, ఇటలీ

by  |
భారత ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన జర్మనీ, ఇటలీ
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై పలు దేశాలు నిషేదం విధిస్తున్నాయి. తాజాగా కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించబోమని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… ‘భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా అధికంగా విస్తరిస్తున్న ప్రాంతంగా భారత్‌ను జర్మనీ గుర్తించింది. అందుకే కరోనా వేరియంట్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన హెచ్చరికల దేశాల జాబితాలో చేర్చాం. భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులను జర్మనీలోకి అనుమతించటం లేదు. కేవలం భారత్ నుంచి వచ్చే జర్మన్ పౌరులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తాం. అయితే వారు కరోనా టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ వస్తే ఆ తర్వాత వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి’ అని అన్నారు. కాగా కరోనాపై యుద్దంలో భారత్‌కు అండగా ఉంటామని, ఈ క్రమంలో ఆక్సిజన్, ఇతర వైద్యపరికరాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో విజయం సాధించడానికి భారత్‌కు సహాయపడతామని చెప్పారు.

ఇటలీలోనూ…

ఇటలీ కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేదం విధించింది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించే ఫైలుపై సంతకం చేసినట్టు ఇటలీ ఆరోగ్య శాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. కాగా ఇటలీకి చెందిన వారు ఇండియా నుంచి స్వదేశంలోకి రావడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. అయితే వారికి నెగటివ్ రిపోర్టు తప్పని సరి అని వెల్లడించారు. ఆ తర్వాత వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు.



Next Story

Most Viewed