ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా జెంటిల్ మేన్-2

by  |
ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా జెంటిల్ మేన్-2
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన డైరెక్టర్ శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జెంటిల్‌మెన్ చిత్రాన్ని నిర్మించి కేటి కుంజుమోన్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా ఈ చిత్రం అందుకున్నది. అంతేగాకుండా తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో కేటి కుంజుమోన్ తమిళ, తెలుగు భాషల్లో రక్షకుడు చిత్రాన్ని నిర్మించి సంచలనం సృష్టించారు. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ సుస్మిత సేన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఎంతో మందిని పరిచయం చేయడంతో పాటు మలయాళం స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్, తమిళ సూపర్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌లతో కేటి కుంజుమోన్ పనిచేశారు. తన సినీ జీవితంలో ఎప్పటికీ గర్తుండిపోయే అపూర్వ విజయం సాధించిన జెంటిల్‌మెన్ పార్ట్-2 చిత్రాన్ని మరింత భారీగా నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ సందర్భగా కేటి కుంజుమోన్ మాట్లాడుతూ… ‘జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువాదించ‌బ‌డి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టింది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్ప‌ద‌నంలో జెంటిల్‌మేన్- 2 తెర‌కెక్కిస్తున్నాం. అన్నారు. అత్యాదునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని అన్నారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, త‌మిళ‌, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్రకటిస్తామని కేటి కుంజుమోన్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed