ఆ మాట చెప్పడానికి గంగూలీ ఎవరు: పీసీబీ

by  |
ఆ మాట చెప్పడానికి గంగూలీ ఎవరు: పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జరగాల్సిన ఆసియా టీ20 కప్ రద్దయ్యిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) గురువారం తీవ్రంగా స్పందించింది. గంగూలీ మాటలకు ఎలాంటి విలువ లేదని, ఆసియాకప్ రద్దు విషయాన్ని ధ్రువీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మాత్రమే అని పీసీబీ మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ స్పష్టం చేశారు. ‘ఆసియాకప్‌పై ఏదైనా ప్రకటన చేయాలంటే అది ఏసీసీ అధ్యక్షుడు మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. అయినా గంగూలీ ప్రతివారం ఏదో ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. ఆయన మాటలకు ఎలాంటి విలువ లేదు. ఆసియాకప్‌పై కేవలం నజ్మూల్ హసన్ మాత్రమే ప్రకటన చేస్తారు. అయినా ఇంతవరకు ఏసీసీ సమావేశం షెడ్యూలే రాలేదు. మరి ఆ ప్రకటన ఎలా చేస్తారు’ అని శామ్యూల్ హసన్ పేర్కొన్నారు. కాగా, బుధవారం ‘స్పోర్ట్స్ తక్’తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో గంగూలీ ఆసియాకప్ టీ20 రద్దయినట్లు ప్రకటించారు. కరోనా కారణంగా ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నాడు.

Next Story