చిన్న వర్షాలకే జలమయం అవుతున్న రోడ్లు.. మంత్రి ఫైర్

by  |
చిన్న వర్షాలకే జలమయం అవుతున్న రోడ్లు.. మంత్రి ఫైర్
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్‌లో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనుల‌ను వేగవంతంగా పూర్తి చేయాలని, పచ్చదనం పరిశుభ్రత‌కు పెద్ద పీట వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు‌లతో కలిసి స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై ఆర్అండ్ బీ అధికారులు, మున్సిపల్, స్మార్ట్ సిటీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో కురిసే చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్ పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయకుండా కట్టడి చేయాలని, పాదచారులు ఫుట్ పాత్‌ల‌పై నడిచి వెళ్లేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. స్మార్ట్ సిటీ బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించుకొని ఆర్ అండ్ బీ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అన్నారు. టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని, రైతులు, వ్యాపారులు కూరగాయలు మార్కెట్ల లోనే విక్రయించుకునే‌లా చూడాలని అన్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని నివారించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. డంప్ యార్డ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ నగరంలో స్మార్ట్ సిటీ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత‌కు పెద్ద పీట వేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story