ఆ దేశంలో ద్రాక్షలు పాడైపోవు.. తెలుసా?

by  |
ఆ దేశంలో ద్రాక్షలు పాడైపోవు.. తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అరుగుదల శక్తి తక్కువ ఉన్నవారికి సత్వరం శక్తిని అందించే ఆహారాల్లో ద్రాక్ష ముఖ్యమైంది. ద్రాక్షతో వైన్, జామ్‌, జెల్లీ, కిస్మిస్‌లు తయారు చేస్తారు. అయితే ద్రాక్షకు త్వరగా పాడయ్యే గుణం ఉండటంతో వెంటనే తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రెండు లేదా మూడు రోజుల్లోనే అవి పాడైపోతాయి. కానీ, అఫ్ఘానిస్థాన్‌లో మాత్రం ఆరు నెలలకు పైగా ద్రాక్షలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా ఉంటున్నాయి. అదెలా సాధ్యం? అందుకు వారి ఏం పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ తెలుసుకుందాం.

ద్రాక్షలో 60కిపైగా జాతులుండగా, 8వేల రకాలున్నాయి. ఏ ద్రాక్ష రకమైనా వాతావరణ పరిస్థితుల కారణంగా త్వరగా పాడైపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. రిఫ్రిజిరేటర్ ఉన్నా, వాటిని ప్రెష్‌గా ఉంచడం సవాలుతో కూడుకున్న పని. అప్ఘానిస్థాన్‌లో ద్రాక్షలు పాడైపోకుండా ఉండటానికి కారణం ‘గంగిన’. అదేం కొత్త టెక్నాలజీ అనుకుంటున్నారా! అదేం కాదు అదో మట్టి పాత్ర. తడిమట్టిని ఉపయోగించి సాసర్ వంటి రెండు పాత్రలను తయారుచేసి ఎండబెడతారు. ఆ పాత్రల్లో ద్రాక్షలను పెట్టి, గాలి చొరబడకుండా సీల్ చేస్తారు. దాంతో అవి నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ పురాతన పద్ధతిని ఉపయోగిస్తే శరత్ రుతువు(సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో) నిల్వ చేసిన ద్రాక్ష పండ్లు వచ్చే ఏడాది వసంతకాలం(మార్చి, ఏప్రిల్, మే నెలల) వరకు తాజాగా ఉంటాయి.

ద్రాక్షపండ్లను ‘గంగినా’లో పెట్టేముందు అవి తాజాగా ఉన్నాయో, లేదో చెక్ చేస్తారు. ఒక్క పండు బాగా లేకపోయినా, మిగతా పండ్లన్నీ కూడా పాడైపోతాయి. అలా స్టోర్ చేసిన గంగిన పాత్రలను ఎండతగలని, చీకటి ప్రదేశాల్లో భద్రపరుస్తారు. వాటికి డిమాండ్ పెరిగిన సమయాల్లోనే రైతులు తమ గంగిన పాత్రల్లో నిల్వచేసిన ద్రాక్షపండ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి, తగినంత లాభానికి అమ్ముకుంటారు. ప్రతి గంగిన కంటైనర్ ఒక కిలో ద్రాక్ష వరకు సర్దుబాటు చేస్తారు. అతి ప్రాచీనమైన కాలం నుంచి సాగుచేస్తున్న పండ్లలో ద్రాక్ష ఒకటి కాగా, వీటి సాగు క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల కిందటే ఆసియాలో మొదలైందని చరిత్ర చెబుతోంది. సుశ్రుత సంహిత, చరక సంహితాలతో పాటు, కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోనూ ద్రాక్ష ఔషధ లక్షణాలను వివరించారు. 20వ శతాబ్దపు తొలి కాలంలో నిజాం వీటిని హైదరాబాద్ తీసుకురాగా, యూరోపియన్ల ద్వారా ఇవి ప్రపంచమంతా వ్యాపించాయి.



Next Story

Most Viewed