వరంగల్‌లో ఫోర్జరీ పత్రాలు, సంతకాలు సృష్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్

by  |
Subhedhari-Police1
X

దిశ, హన్మకొండ టౌన్: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావాల్సిన పత్రాలు, పూచీకత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ను గురువారం టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన రబ్బర్ స్టాంప్స్ తో పాటు నకిలీ ఇంటి విలువ చేసే ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన ఆధార్ కార్డులు, పాస్ ఫొటో సైజు ఫోటోలతోపాటు మూడు సెల్‌ఫోన్లు, రూ. మూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ అలియాస్ రాజేష్ నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తా విధులు నిర్వహిస్తుండేవాడు. తన లాయర్ వద్దకు వచ్చే వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు గాను అవసరమయిన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందుగాను నిందితుడు రాజశేఖర్ మిగితా నిందితులను సంప్రదించేవాడు. దీంతో మిగితా నిందితులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ రాజ్ రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరు మీదుగా హైదరాబాద్ లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకుని బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద గ్రామ పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన రీతిలో నకిలీ ధృవీకరణ పత్రం, నకిలీ ఇంటి విలువ, నకిలీ ఇంటి పన్నుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను సృష్టించి నిందితుడు రాజశేఖర్ కు అందజేసేవారు. నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతోపాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్‌కార్డులతో పాటు సదరు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ముందు హజరయ్యేవారు.

Warangal-seized1

ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసులు కలిసి సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని అపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద అనధికారికంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి, పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి రబ్బర్ స్టాంపులతో పాటు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు దొరకడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు పాల్పడుతున్న నేరాలను అంగీకరించడంతోపాటు నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగితా నిందితులను అరెస్టు చేశారు. ఈ ఫోర్జరీ బెయిల్ పత్రాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడంతోపాటు, స్వాధీనం చేసుకున్న ఫోర్జరీ పత్రాలను కోర్టుకు సమర్పించి బెయిల్ పొందిన నిందితులపై విచారణ చేపట్టనున్నట్లు, అదే విధంగా ఫోర్జరీ పత్రాల వ్యనహారాన్ని కోర్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు లవణ్ కుమర్, రవళి, సుబేదారి ఎస్సై పున్నం చందర్, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేష్, రాజు, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, ఆలీ, హోంగార్డ్ విజయ్ ను కమిషనర్ అభినందించారు.



Next Story

Most Viewed