కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి.. గాదరి కిషోర్ సంచలన కామెంట్స్

by  |
కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి.. గాదరి కిషోర్ సంచలన కామెంట్స్
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఈ సందర్భంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని అన్నారు.

ఈటల రాజేందర్ ఆస్తులను కాపాడుకోవడం కోసమే, ఇల్లందకుంటలో ఆస్తుల విలువ పెంచుకునేందుకే.. వావిలాలను మండలం చేయకుండా జమ్మికుంట మండలానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందకుంటను మండలం చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయకుండా తెలంగాణ ద్రోహిగా మిగిలారని అన్నారు.

అవినీతి ప్రభుత్వమని మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గోవా ప్రభుత్వం అవినీతి చేస్తే గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రశ్నించిన కారణంగా ఆయనను అక్కడి నుండి తప్పించిందని అన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచి రెండున్నర సంవత్సరాలు గడిచినా నేటి వరకు కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్‌పై వ్యాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ. 22 మాత్రమే వస్తున్న విషయం కూడా తెలియని దద్దమ్మలు బీజేపీ నాయకులు అని అన్నారు.

కాంట్రాక్టులు అన్నీ ఆంధ్రా కంపెనీలకు కట్టబెడుతున్నారని అంటున్న రేవంత్ రెడ్డి.. నువ్వు తిరిగే కారు ఆ కాంట్రాక్టర్లు ఇచ్చింది కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, ఆయనను హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, సైదిరెడ్డి, వివేకానంద గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed