కుండపోత వర్షం.. నిండా మునిగిన పాలమూరు

by  |
కుండపోత వర్షం.. నిండా మునిగిన పాలమూరు
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : పాలమూరు పట్టణాన్ని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి మొదలుకుని ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో పాలమూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బీకే రెడ్డి కాలనీ, మహేశ్వర కాలనీ, పెనుగొండ, శివశక్తి నగర్, రామయ్య బౌళి, శేషాద్రి నగర్ తదితర కాలనీలలో వర్షపు నీళ్లన్నీ ఇళ్లల్లోకి చేరాయి. ఆకస్మికంగా వచ్చిన వరద నీటితో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌కు ఫొన్ చేసి సమాచారం అందజేశారు. అయన వెంటనే జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులను అప్రమత్తం చేశారు.

మూడున్నర గంటలకు మంత్రి ముంపు ప్రాంతాలకు చేరుకున్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ సిబ్బంది సైతం అప్రమత్తమయ్యారు. పలు కాలనీలలో ఉధ‌‌‌‌‌‌‌ృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని, ఎస్పీ కాలనీలలో పర్యటించి మంత్రి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కొన్ని కాలనీలకు వాహనాలలో వెళ్ళే అవకాశం లేకపోవడంతో మంత్రి మోటార్ సైకిల్ పై పర్యటించారు. ఉదయం ఆరున్నర గంటల వరకు మంత్రి లోతట్టు ప్రాంతాల పరిశీలన పూర్తిచేసుకుని, ఆ తర్వాత జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story