MLC రేసులో నేతల మంతనాలు.. వారి వైపే KCR చూపు.?

by  |
MLC రేసులో నేతల మంతనాలు.. వారి వైపే KCR చూపు.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభ్యుల కోటా నుంచి ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు దసరా తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ వస్తుందనే గంపెడాశతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ మరో వైపు ఖాళీ అయిన స్థానంలో అవకాశం కల్పించాలని మంతనాలను ముమ్మరం చేశారు. సీఎంకు సన్నిహితంగా ఉన్న వారితో పావులు కదుపుతున్నారు. అయితే, పదవీకాలం ముగిసిన వారిలో ఎంతమందికి రెన్యూవల్ చేస్తారు.? కొత్తగా ఎంతమందికి ఇస్తారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

శాసనమండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీకాలం పూర్తైంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత కాగా, గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ స్థానాల కోసం అధికార పార్టీకి చెందిన నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పావులు కదుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఉద్యమ కాలంలో పార్టీ కోసం పనిచేసిన అనుభవం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్న వారి వివరాలను పార్టీ అధిష్టానం ఇప్పటికే సేకరించింది. గతంలో పదవులు అనుభవించిన వారికి కాకుండా యువతకు అవకాశాలు కల్పించాలని, చురుగ్గా పనిచేసేవారికి ప్రాధాన్యం ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించేలా అధిష్టానం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

అదే విధంగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. వీరు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. వీరిలో కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్ రెడ్డి, భాను ప్రసాద్, పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్ రావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే, మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పాతవారిలో ఎంతమందికి రెన్యూవల్ చేస్తారనే చర్చ జరుగుతోంది. దసరాకు ముందే నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశావాహులు భావించినప్పటికీ హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు సమాచారం.

ఆరు ఎమ్మెల్సీ స్థానాలను సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా తాడూరి శ్రీనివాస్, శ్రవణ్ రెడ్డి, ఫరీదుద్దీన్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే సీఎం పలు జిల్లాలకు చెందిన నేతలకు ఎన్నికల సమయంలో పదుల సంఖ్యలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో వారు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. పదువుల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఆశీర్వాదం మాత్రం ఎవరికి ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఏదీ ఏమైనప్పటికీ పాతవారికి ఎంతమందికి, కొంతవారికి ఎంతమందికి ఎమ్మెల్సీ దక్కుతుందోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed