త్వరలో భారీ నియామకాలకు సిద్దమైన టెక్ సంస్థ

by  |
atos
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పలు అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా భారీ నియామకాలను చేపడుతున్నాయి. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ అటోస్ రానున్న 12 నెలల్లో భారత్‌లో దాదాపు 15,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా సంస్థకున్న 40 వేల మంది ఉద్యోగులతో కలిపి ప్రపంచంలోని సైబర్ సెక్యూరిటీ సంస్థల్లో అగ్ర స్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు అటోస్ చీఫ్ ఎగ్జిక్యూటి ఎలీ గిరార్డ్ చెప్పారు. గత కొంతకాలంగా దేశంలో డిజిటలీకరణ పెరుగుతుండటంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగం, రక్షణ రంగం సహా అనేక రంగాల్లో డిమాండ్ అధికంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం ఉన్న ఉద్యోగులను కలిగిన దేశాల్లో భారత్ ఒకటని, అయితే ప్రస్తుతం డిమాండ్‌కు సరఫరాకు మధ్య అంతరం ఎక్కువగా ఉందని ఎలీ గిరార్డ్ అన్నారు.

20 ఏళ్ల క్రితం తాము ఉత్పాదకత సవాళ్లను ఎదుర్కొన్నామని, మళ్లీ ఇన్నేళ్లకు డిజిటలైజేషన్ కారణంగా ఆ స్థితిని చూస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌లో ప్రతి ఏడాది సుమారు రూ. 3,450 కోట్లను ఉద్యోగుల సంబంధిత ఖర్చులకు వినియోగిస్తోందని గిరార్డ్ పేర్కొన్నారు. కాగా, ఫ్రెంచ్‌కు చెందిన అటోస్ సంస్థ ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంది. అధిక పనితీరు కలిగిన కంప్యూటర్లను అసెంబుల్, టెస్టింగ్ చేయడం కోసం అధిక పెట్టుబడులను పెట్టినట్టు గిరార్డ్ చెప్పారు. సంస్థకు మొత్తం ఆదాయంలో మూడో వంతు భారత్ నుంచే వస్తోందని ఆయన వెల్లడించారు.

Advertisement
Next Story

Most Viewed