‘గత ప్రభుత్వాలు చేయలేనివి.. ఆరేళ్లలో చేశాం’

by  |
‘గత ప్రభుత్వాలు చేయలేనివి.. ఆరేళ్లలో చేశాం’
X

దిశ, క్రైమ్ బ్యూరో: ముస్లీం మైనార్టీ విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చిదిద్దేందుకు సివిల్స్ కోచింగ్‌ను ప్రభుత్వం నుంచి ఉచితంగా అందిస్తున్నట్టు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతేగాకుండా, ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతున్నట్టు తెలిపారు. నాంపల్లి మదీనా కళాశాలలో శనివారం మైనార్టీ సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు 68 ఏళ్లలో చేయలేనివి, తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆరేళ్లలోనే చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు కేవలం 12 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, అందులో 1820 మంది పిల్లలు మాత్రమే ఉండేవారన్నారు.

తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, 80 జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో 90 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. మక్కా మసీదు పునరుద్ధరణకు రూ.8 కోట్లు, జామియా నిజామియా ఆడిటోరియం కోసం రూ.14.5 కోట్లు అందించారు. అదనంగా, ఇస్లామిక్ సెంటర్‌కు పదెకరాల భూమి మరియు రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ముస్లింల సంక్షేమ పథకాలకు, సంక్షేమానికి మన రాష్ట్రం మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచినదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బద్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నవాబ్ అర్షద్, సయ్యద్ మెహబూబ్, డాక్టర్ ముక్తార్ అహ్మద్, నుస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed