వెనక్కి వెళ్తున్న విదేశీ పెట్టుబడులు!

by  |
వెనక్కి వెళ్తున్న విదేశీ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) క్షీణిస్తున్నాయి. మే నెలలో ఇప్పటివరకు రూ. 6,452 కోట్ల విలువైన ఎఫ్‌పీఐలు భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. మొత్తం ఎఫ్‌పీఐలలో ఈక్విటీల రూపంలో రూ. 6,427 కోట్లు, డెట్ విభాగం నుంచి రూ. 25 కోట్లను వెనక్కి తీసుకున్నట్టు డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో భారత మూలధన మార్కెట్ల నుంచి ఈక్విటీ, డెట్ విభాగాల్లో మొత్తం రూ. 9,435 కోట్లను వెనక్కి తీసుకున్నట్టు గణాంకాలు తెలిపాయి.

‘దేశంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కరోనా సెకెండ్ వేవ్, జీడీపీ వృద్ధి, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక గణాంకాల వంటి ప్రతికూల పరిణామాల వల్లే ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెనక్కు వెళ్తున్నాయని’ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెప్పారు. ‘ఆర్థికవ్యవస్థపై కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం ఎంతమేరకు ఉందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని’ గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఓఓ హర్ష్ జైన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ, ఫార్మా, కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఎఫ్‌పీఐలు కొనసాగుతున్న కారణంగానే కొంతమేర సానుకూలంగా ఉన్నాయని విజయకుమారు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed