దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి భారీగా వచ్చిన ఎఫ్‌పీఐలు

by  |
దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి భారీగా వచ్చిన ఎఫ్‌పీఐలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) భారీగా వచ్చి చేరాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎఫ్‌పీఐల రూపంలో వచ్చిన మొత్తం రూ. 2,74,034 కోట్లకు చేరుకుందని, ఇది భారత ఆర్థికవ్యవస్థ పట్ల విదేశీ పెట్టుబడిదారుల స్థిరమైన విశ్వాసానికి ప్రతీక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సర కాలానికి ఏప్రిల్‌లో నికరంగా రూ. 6,884 కోట్లు, సెప్టెంబర్ నెలలో రూ. 7,783 కోట్ల ఎఫ్‌పీఐలు మాత్రమే తరలి వెళ్లినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రం దశలవారీగా అమలు చేసిన చర్యల కారణంగానే ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకోవడమే ఎఫ్‌పీఐ నిధుల పెరుగుదలకు దోహదపడినట్టు వివరించింది.

పలు ఆర్థిక సంస్థలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో చేపట్టిన చర్యలు కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచినట్టు కేంద్రం అభిప్రాయపడింది. వీటిలో సెబీ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ కామన్ అప్లికేషన్ ఫారమ్(సీఏఎఫ్) కార్యాచరణ, ఎఫ్‌పీఐ రెగ్యులేటరీ విధానాలను హేతుబద్దీకరణతో పాటు మరింత సరళీకరణ చేపట్టం, పాన్ కేటాయింపు, బ్యాంకు, డీమ్యాట్ ఖాతాలను తెరవడం వంటి చర్యలు ఎఫ్‌పీఐ పెట్టుబడుల రాకకు తోడ్పాటు అందించాయి. అలాగే, దేశీయ కంపెనీల్లో మొత్తం ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితిని 24 శాతం నుంచి సెక్టోరల్ క్యాప్‌నకు పెంచడంతో ప్రధాన ఈక్విటీ సూచీల్లో భారతీయ సెక్యూరిటీల పటిష్ఠతకు దోహదం చేసినట్టు కేంద్రం పేర్కొంది. దీంతో భారత మూలధన మార్కెట్లోకి ఈక్విటీ పెట్టుబడులు పెరిగాయి. 2021-22లో భారత వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇంకా ఇతర పరిశోధనా సంస్థలు 10 శాతానికి పైగా నివేదించాయి. ఈ పరిణామాలతో సమీప భవిష్యత్తులో భారత్ ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా ఉంటుందని కేంద్ర వెల్లడించింది.



Next Story

Most Viewed