ఓపెన్ కావడం లేదని ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన దొంగలు

by  |
ఓపెన్ కావడం లేదని ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్ : వాళ్లు నలుగురు దొంగలు. ఏటీఎంను దోచుకోవడానికి వచ్చారు. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. వాళ్లు వెంట తెచ్చుకున్న సామాగ్రితో ట్రై చేసినా ఫలితం శూణ్యం. దీంతో చిర్రెత్తుకొచ్చి ఏకంగా ఏటీఎంనే మాయం చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ ఏరియాలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది ఈ ఘటన.

వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ లో తిరుప్పూర్-ఉతుక్కులి రోడ్డు పక్కన ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం చోరీకి గురైంది. ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు దుండగులు.. ఏటీఎం మిషన్‌ను తెరవడానికి ప్రయత్నించారు. ఎంత యత్నించినా అది తెరుచుకోకపోయేసరికి వారికి ఓపిక నశించింది. ఇక దీనిని ఓపెన్ చేయడం తమ వల్ల కాదనుకున్నారు. వెంటనే దానిని అక్కడినుంచి తీసి తమ వెంట తెచ్చుకున్న ఆటోలో ఎక్కించారు.

ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలలో రికార్డైంది. నిందితులు నలుగురు ముఖాలకు మాస్కులు ధరించి లోపలికి వచ్చి ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు అధికారులు స్పందిస్తూ.. గతనెలలో ఏటీఎంలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేశామనీ, అందులో ఇంకా సుమారు రెండు లక్షల రూపాయల దాకా నగదు మిగిలి ఉన్నదని తెలిపారు. రాత్రిపూట ఏటీఎంకు సెక్యూరిటీ గార్డు కాపలాగా లేడా..? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. రెండేళ్లుగా ఈ ఏటీఎంకు గార్డు లేరని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం వేట ప్రారంభించారు.


Next Story