హింసాకాండ ఉధృతం.. సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురి మృతి

by  |
హింసాకాండ ఉధృతం.. సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింసాకాండ చెలరేగింది. నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అటుగా వచ్చిన బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ వాహనంపై తృణమూల్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది ఆమెను సురక్షితంగా రక్షించగలిగారు. అంతేకాకుండా ఈ ఉదంతాన్ని కవర్ చేస్తున్న మీడియా వాహనాలపై కూడా టీఎంసీ ఫాలోవర్స్ దాడికి పాల్పడ్డారు. ఈ హింసాకాండలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో హింసాకాండ ఉధృతం కావడంతో సీఆర్ఫీఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలీసుల కథనం ప్రకారం.. సీఆర్పీఎఫ్ జవాన్ల తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించడమే కాకుండా, వారిపై ఆందోళన కారులు దాడి చేసేందుకు సిద్ధపడటంతో వారు కాల్పులు జరిపారని చెప్పారు. ఇదిలాఉండగా, హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

కాగా, టీఎంసీ విజయాన్ని తట్టుకోలేక ‘మోషా’లు తమ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపించారని టీఎంసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. జవాన్ల కాల్పుల్లో చనిపోయిందని నలుగురు కాదని, మొత్తం ఐదుగురు అని పేర్కొన్నారు. ఈ దాడి కూచ్ బిహార్ జిల్లాలోని సీతల్ కూచి నియోజక వర్గంలో శనివారం జరిగింది.



Next Story