ఒక్క వారంలో నాలుగు ఐపీఓలు

by  |
ఒక్క వారంలో నాలుగు ఐపీఓలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు నెలల కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) హడావుడి లేదు. చివరిగా ఏప్రిల్‌లో మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓకు వచ్చిన తర్వాత కొంత విరామం అనంతరం ఈ వారంలోనే ఏకంగా నాలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. వీటిలో హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు కంపెనీలు ఉండటం విశేషం. ఈ నాలుగు కంపెనీలు మొత్తం రూ. 9,123 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాయి. ఈ వారంలో వచ్చే ఐపీఓలు 16-18 మధ్య జరగనున్నాయి. వీటిలో వైద్య సేవల రంగ సంస్థ కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) రూ. 2,144 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు రానుంది.

ఈ సంస్థ మొత్తం 2.35 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ప్రైస్‌ బ్యాండ్‌ రూ.815–825గా నిర్ణయించింది. మరో సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ డొడ్ల డెయిరీ సైతం రూ. 520 కోట్ల నిధులను సాధించేందుకు మొత్తం 1.09 కోట్ల షేర్లను ఐపీఓలో ఉంచనుంది. ఒక్కో షేర్ ధర రూ. 421-428గా నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ మెటల్స్ ఉత్పత్తి సంస్థ శ్యామ్ మెటాలిక్స్ ఐపీ ద్వారా రూ. 909 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఉంది. ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్ రూ. 303-306గా ఉంది. మరో కంపెనీ ఆటోమొబైల్ విడిభాగాలాను తయారు చేసే సోనా కామ్‌స్టర్స్. ఈ కంపెనీ మొత్తం రూ. 5,250 కోట్లను సమీకరించనుంది. కంపెనీ షేర్ బ్యాండ్ ప్రైస్ ధర రూ. 285-291గా నిర్ణయించింది.

Next Story