బడ్జెట్‌పై చర్చలు నాలుగు రోజులే.. ఎందుకు..?

by  |
బడ్జెట్‌పై చర్చలు నాలుగు రోజులే.. ఎందుకు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పది రోజుల సెషన్‌లో బడ్జెట్‌పై చర్చ మాత్రం కేవలం నాలుగు రోజులే జరగనుంది. ఈ నెల 18న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. అవసరాన్ని బట్టి సమావేశాలను పొడిగించుకోవచ్చని స్పీకర్ పేర్కొన్నప్పటికీ ఈ నెల 26న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం లభించిన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

మొత్తం బడ్జెట్ సమావేశాలు కేవలం పది రోజుల్లోనే ముగించేలా షెడ్యూలు ఖరారు కావడం విపక్షాలకు సంతృప్తినివ్వలేదు. సాధారణంగా కనీసం నెల రోజుల పాటు జరిగే బడ్జెట్ సమావేశాలు కేవలం పది రోజులకు కుదించడం, బడ్జెట్‌మీద చర్చలకు నాలుగు రోజులే కేటాయించడంపై విపక్ష పార్టీల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది బడ్జెట్ సమావేశాలను దాదాపు మూడు వారాలకు పైగా నిర్వహించాలని షెడ్యూలు ఖరారు చేసినా కరోనా కారణంగా కేవలం పది రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈసారి మొత్తం సమావేశాలను పది రోజులకే కుదించడంతో వివిధ శాఖల పద్దులపై చర్చించడానికి తగినంత సమయం సరిపోతుందా అనే అభిప్రాయం విపక్షాల నుంచి వ్యక్తమవుతోంది.

బడ్జెట్ సమావేశాల షెడ్యూలు ఇలా..

మొత్తం పది రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూలును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఖరారు చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే సోమవారం వాయిదా పడింది. మరణించిన సభ్యులకు మరుసటి రోజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై సభ్యులు చేసే ప్రసంగాల అనంతరం వాయిదా పడుతుంది.

మార్చి 16 – మరణించిన సభ్యులకు సంతాపం
మార్చి 17 – గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, సీఎం వివరణ
మార్చి 18 – రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమర్పణ
మార్చి 20 – బడ్జెట్‌పై చర్చ
మార్చి 22 నుంచి మార్చి 25 వరకు బడ్జెట్‌పై నిరవధిక చర్చ
మార్చి 26 – ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
మార్చి 19, 21 – సెలవుదినాలు


Next Story

Most Viewed