మాజీ హోంమంత్రి నాయిని కన్నుమూత

by  |
మాజీ హోంమంత్రి నాయిని కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (86)బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్, న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఇటీవల జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్ మీదనే చికిత్స తీసుకుంటున్న నాయిని ఆరోగ్యం మరింతగా క్షీణిచిందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గత మూడు రోజులుగా పలువురు మంత్రులు కూడా ఆసుపత్రికి వెళ్ళి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు. చికిత్స అనంతరం కోలుకుని వస్తారని అందరూ భావించినా చివరకు మృతిచెందారు.

తొలి నుంచి ఉద్యమ నాయకుడిగా పేరున్న నాయిని నర్సింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను సీఎం కేసీఆర్ ఆయనకు అప్పగించారు. అందరూ ఆయనను బుల్లెట్ నర్సన్న అని పిలుస్తారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన తనకిష్టమైన బుల్లెట్ మీదనే పర్యటించేవారు. నాయిని స్వగ్రామం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము. ఆయన 1944లో జన్మించారు. ఆయనకు భార్య అహల్య, కుమారుడు దేవేందర్, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు.



Next Story

Most Viewed