'సార్.. మీ రాక మాకు గర్వంగా ఉంది'

by  |
Busines1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ ను బోర్డు చైర్మన్‌గా నిమించినట్టు ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే మంగళవారం ప్రకటించింది. భారత్‌పే స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను రజనీష్ పర్యవేక్షిస్తారని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా సంస్థ వ్యాపార, నియంత్రణ కార్యక్రమాలపై ఇతర బోర్డు సభ్యులు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్(సీఎక్స్ఓ)లతో కలిసి పని చేస్తారని కంపెనీ తెలిపింది.

అదేవిధంగా వ్యాపార పనితీరు, కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన విషయాలపై కంపెనీ నిర్వహణ విభాగాని(మేనేజ్‌మెంట్)కి సలహాలందిస్తారు. రజనీష్ కుమారు 2017 అక్టోబర్ నుంచి 2020, అక్టోబర్ వరకు భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే, నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ఎస్‌బీఐలోని కంప్లయెన్స్ అండ్ రిస్క్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అంతకుముందు ఎస్‌బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌కు మర్చంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్నారు. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ ఆసియా విభాగం, ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ బోర్డులలో ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ‘ఎన్నో కీలక బాధ్యతలను నిర్వహించిన రజనీష్ కుమార్ లాంటి వ్యక్తితో పనిచేయడంపై సంతోషంగా ఉంది. భారత బ్యాంకింగ్ పరిశ్రమలో ప్రముఖులుగా ఉన్న ఆయన తమ సంస్థ బోర్డు చైర్మన్‌గా చేరేందుకు అంగీకరించడం గర్వంగా ఉంది. సమర్థవంతమైన నాయకత్రంలో భారత్‌పే కొత్త వ్యూహాలతో కొనసాగుతుందని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ చెప్పారు.


Next Story