ఆ వివాదాలకు కాంట్రాక్టర్లే కారణం- బీజేపీ నేత

by  |
bjp leader news
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కాంట్రాక్టర్లే కారణమని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ అన్నారు. అక్కడా, ఇక్కడా పని చేస్తూ రాష్ట్రాల మధ్య రాయబారం చేస్తూ కాంట్రాక్ట్​ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల న్యాయమైన వాటా.. పెండింగ్​ ప్రాజెక్టుల పూర్తి అంశంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్​ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య మెఘా సంస్థ రాయబారం చేస్తుందని, రెండుచోట్లా కాంట్రాక్ట్​ పనులు చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో తెలంగాణ తరుపున ఏపీ సీఎం జగన్​కు నిధులు సమకూర్చారని, ఈ నిధులను మెఘా సంస్థ మధ్యవర్తిత్వంతోనే వెళ్లాయని ఆరోపించారు.

ఒక రాష్ట్రంలో కాంట్రాక్ట్​ పనులు చేస్తూ మరో రాష్ట్రంలో కూడా పనులు చేయడానికి అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై జీవో జారీ చేయాలని వివేక్​ డిమాండ్​ చేశారు. నిర్మాణ సంస్థలే జల వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. కృష్ణా జలాలను దోచుకుంటున్నారని ఏడేండ్ల తర్వాత కేసీఆర్​కు గుర్తుకు వచ్చిందని, కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో ఎందుకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా రెండు రాష్ట్రాలు ఆడుతున్న నాటకమన్నారు.

నీటిపారుదల శాఖ రిటైర్డ్​ ఇంజినీర్​ దొంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కృష్ణాలో తెలంగాణకు ఎక్కువ వాటా రావాల్సి ఉందని, కానీ ఏపీకి న్యాయం చేసేందుకు తెలంగాణ తలొగ్గిందన్నారు. అసలు జల వివాదాలకు కారణం రాజకీయ ప్రయోజనాలేనన్నారు. ఏపీ సీఎం జగన్​ సోదరి తెలంగాణలో పార్టీ పెట్టకుండా సీఎం కేసీఆర్.. జగన్​పై ఒత్తిడి తీసుకువచ్చారని, అందుకు రాజీ కుదరకపోవడంతోనే ఈ వివాదాలు బయటకు వచ్చాయన్నారు. ఈ నీళ్ల సెంటిమెంట్​ను రగిలించి రెండు రాష్ట్రాలూ రాజకీయంగా లబ్ధి పొందుతాయని విమర్శించారు. ఈ సందర్బంగా కృష్ణా జలాల అంశంపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్​తో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన సంఘాలు, నేతలు, ఇరిగేషన్​ నిపుణులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed