రాజకీయ ఎజెండానా.. రహస్య ఎజెండానా?

by  |
రాజకీయ ఎజెండానా.. రహస్య ఎజెండానా?
X

దిశ, ఖ‌మ్మం: దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చేవిధంగా, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 203 జీవోపై సోమవారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో తెలంగాణ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమ్మర్శించారు. దీని వెనుక రాజకీయ ఎజెండా గాని, రహస్య ఎజెండా ఏమైనా ఉందా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత మే 5న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203లో మూడు టీఎంసీల నీటిని వాడుకుంటామని చెప్పి ఇప్పుడు 8 టీఎంసీల వరకూ వాడుకుంటామని ట్రిబ్యునల్‌కు సోమవారం తెలిపిందన్నారు.

ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతో, ఎందరో త్యాగధనుల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టం సెక్షన్ 84 ప్రకారం ఏపీ ప్రభుత్వ జీవో చట్టవిరుద్ధమని, తాను ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ట్రిబ్యునల్ పర్యావరణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీన్ని సాకుగా చూపించి టెండర్లు పిలువచ్చు, తమదే విజయమంటూ పత్రికలలో వార్తలొచ్చాయన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టేనని ఆయన హితవు పలికారు. ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినపుడు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని ఆయన గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను తెలంగాణ ప్రభుత్వం త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

Next Story

Most Viewed