ప్రభుత్వం తెచ్చిన అప్పులు జగనార్పణం..

by  |
kalavenkatarav
X

దిశ,ఏపీ బ్యూరో: కరోనాతో సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల నడ్డివిరిచేలా సీఎం జగన్ పాలన ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ విడతల వారీగా కరెంటు చార్జీలు పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. రెండున్నరేళ్లలోనే రూ. 11,611 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారని మాజీమంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. కరెంట్ షాక్ కొడుతుందని అందరికీ తెలుసునని కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు చూస్తున్నా షాక్ కొడుతుందని ఆరోపించారు. విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు ఇళ్లల్లో దీపాలు వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు రూ.100బిల్లు వస్తే నేడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నదంతా ఊడ్చి బిల్లులు కడితే మహిళలు ఏ విధంగా సంసారాలు నడుపుకోవాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 5సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా ఆరోసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలన, అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల వద్ద నుండి వసూలు చేయాలని నిర్ణయించారు.

2019-20 లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు తగ్గినా ప్రభుత్వం సర్ధుబాటు (ట్రూఅప్) ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి పోలవరం పునరావాస కాలనీల్లో సైతం విద్యుత్ బిల్లులతో జగన్ రెడ్డి ప్రజల నడ్డి విరుస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 24,491 కోట్లు అప్పు తెచ్చినా ఆ అప్పు తన అవినీతికి, దుబారాకు జగనార్పణం చేశారని’ మాజీమంత్రి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed