‘మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలు సరికాదు’

by  |
‘మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలు సరికాదు’
X

దిశ, కరీంనగర్ సిటీ : తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం ఏర్పాటుపై మాజీమంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సరికావని, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి ప్రకాష్ అన్నారు. శనివారం నగరంలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అప్పటి ఉద్యమనేత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అనుమతితోనే 2004లో సంఘాన్ని స్థాపించినట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్లుగా తమ సంఘాన్ని ప్రస్తుత మంత్రి కొప్పులఈశ్వర్ ఏర్పాటు చేయలేదని, కార్మిక సంఘాలతో ఉన్న అనుబంధం రీత్యా దివంగత మంత్రినాయిని నరసింహారెడ్డి, మంత్రి ఈశ్వర్ లకు తమ సంఘాన్ని చూసే బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు.

ఎమ్మెల్యే ఈటల తప్పుడు ప్రచారం మానుకుని, వాస్తవాలు మాట్లాడాలని హితువు పలికారు. కార్మిక సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ఈటల ఎప్పుడు ముందుకు రాలేదని, కెసీఆర్‌తో తనకున్న సంబంధాలతో నేరుగా వెళ్లి వివరించి పరిష్కరించినట్లు, దీనిని జీర్ణించుకోలేని ఈటల తమ సంఘాన్ని పట్టించుకోకుండా, ఇతరులకు మద్దతునిచ్చెదని మండిపడ్డారు. కేవలం కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, కవిత మాత్రమే తమను సీఎం వద్దకు తీసుకెళ్లేవారన్నారు.

2014, 18 లలో టీఆర్ వీకెఎస్ సూచనతోనే పే స్కెల్‌ను ప్రభుత్వం పెంచిందని, కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలుగా అయిన తర్వాతనే విద్యుత్ కార్మికుల వేతనాలు పెరిగాయని తెలిపారు. తన ఆస్తులు కాపాడుకునేందుకే ఈటల బీజేపీ‌లోకి వెళ్తున్నాడని, 2016 నుంచే అవమానాలేదుర్కొంటే ఇన్నాళ్లు పార్టీలో ఎందుకున్నట్లో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను బదునాం చేయడానికే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా మాత్రమే తమ సంఘం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ రాజలింగం, మునిందర్, రాందాస్, తిరుపతి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed