మీలో రోషం లేదా… ఓ రోజు జైలుకెళ్తే ఏమౌతుంది : చంద్రబాబు

by  |
chandrababu in gnt
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాటల్లోనే మీకు రాజదాని కావాలి… చేతల్లో ఏం చేయరు అంటూ విరుచుకుపడ్డారు. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరు ఏం చేశారు అని ప్రజలను నిలదీశారు. గుంటూరు వాసులకు స్వార్దం , పిరికితనం ఎక్కువ, రోషం లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసులకు భయపడేది లేదు:

ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైపోయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసులు పెట్టి భయపెడతారు.. ఓ రోజు జైలుకు వెళ్తే ఏమౌతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”నా మీద కూడా కేసులు పెట్టారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాను. నేను భయపడే సమస్య లేదు. వడ్డి తో సహా తిరిగి చెల్లించే రోజులు వస్తాయి. గుంటూరు కార్పోరేషన్ లో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టే. ఓ రౌడీ కి మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఇచ్చారు. గుంటూరు లో నానీ ఓడిపోతే వైసీపీ వాళ్లు బరితెగిస్తారు. గుంటూరు వాళ్లు చేతగాని వాళ్లు అని విచ్చలవిడితనం చేస్తారు. సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా నిత్యవసర ధరలు ఆకాశానికి అంటించారు” అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. కుక్కు, పిల్లి, పంది, పిల్లి, గాడిద పిల్లకు కూడా పన్ను వేసే పరిస్థితి వస్తుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను గెలిపిస్తే జగన్ కి అమ్ముడుపోయాడు:

మీకు రోషం లేదా.. 2వేలు డబ్బులు ఎవరూ ఇస్తే వాడికి ఓటు వేస్తారా అంటూ నిలదీశారు. వలంటీర్ ను చూస్తేనే మీరు భయపడిపోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పడ్డ ఇబ్బందులు 2వేలు ఇస్తే మర్చిపోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు తీగ పట్టుకోవద్దని చెప్పినా వినలేదని ఇప్పడు పిడుగుద్దులు తింటున్నారంటూ ప్రజలను ఉద్దేశించి విమర్శలు చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ను తాను గెలిపిస్తే జగన్ కు అమ్ముడుపోయాడని..ఒక్కడు పోతే వందమందిని తయారు చేస్తానని చెప్పుకొచ్చారు.

ఎవరైనా వస్తే రాజీనామా చేసి రావాలని సత్యహరిశ్చంద్రుడు లా మాట్లాడాడు అంటూ చెప్పుకొచ్చారు. బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఏం చేశాడు.. పింక్ డైమండ్ కేసు ఏమైంది..చెల్లెలి కి న్యాయం చేయలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. గుంటూరు మిర్చి రోషం మీలో లేదా… ఎందుకు భయపడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. గుంటూరు మిర్చి ఘాటు ఏంటో 10 తేది ఎన్నికలలో చూపించాలి. అపార్ట్మెంట్ లలో ఉండే వారు ఆలోచించాలన్నారు. ఎండలో మేమేందుకు నిలబడి ఓటు వేయాలని అనుకుంటే మీ కర్మ అంటూ అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే అందరి చిట్టా లెక్కలు తేలుస్తానంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed