హైకోర్టు దర్యాప్తునే పక్కదారి పట్టించబోయాడు

by  |
anil-deshm
X

దిశ వెబ్‌డెస్క్: మహరాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లాయర్ ఆనంద్ దాగాను సీబీఐ అరెస్ట్ చేసింది. బాంబే హైకోర్టును అనిల్ దేశ్‌ముఖ్ కేసు విషయంలో ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ ఆనంద్ దాగాను, సీబీఐ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ తివారీని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఆనంద్‌ను వెంటనే ట్రాన్సిట్ వారెంట్‌పై ఢిల్లీకి తరలించినట్లు వెల్లడించింది. అనిల్ దేశ్‌‌ముఖ్ ప్రతి నెల ముంబాయిలో ఉన్న ప్రతి రెస్టారెంట్, బార్ నుంచి వంద కోట్లు వసూలు చేయమని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని ముంబాయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రస్తుతం దానిపై సీబీఐ విచారణ జరుపుతుంది. ఈ కేసు విచారణ పై సీబీఐ రూపొందించిన నివేదిక బహిర్గతం అయినట్లు తెలిసింది. ఇందులో అనిల్ దేశ్‌ముఖ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు బయటపడింది. ఈ నివేదిక కూడా ప్రభావితమైనట్లు గుర్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థ, వెంటనే నాగపూర్ కేంద్రంగా ఉన్న తమ ఇన్‌స్పెక్టర్‌ను సైతం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిపై ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కుట్ర పూరితంగా వ్యవహరించటం, విధులకు భంగం కలిగించటం, అవినీతి నిరోధక సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

Next Story