టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ సంచలన ఆరోపణలు

by  |
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ సంచలన ఆరోపణలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయ నేతలతో పోటీ పడి మరీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు కురిపించారు. తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసేందుకు అనుమతించాలని కోరుతూ 2020 జూన్ 24న వీకే సింగ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఆయన వీఆర్ఎస్‌ను అనుమతించపోగా.. ఆయనకు చార్జ్‌మెమో ఇచ్చిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ, ముఖ్యంగా ఈ పరిణామాల క్రమంలో తన విమర్శలకు మరింత దూకుడును పెంచారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని ద్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా వైఫల్యం చెందినట్టు విమర్శించారు.

పేద ప్రజలకు నిర్మిస్తానన్నా డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఏమయ్యాయని నిలదీశారు. ఎన్నికలకు ముందు మాత్రమే నిరుద్యోగులకు ప్రభుత్వం పథకాలను ప్రకటిస్తోందన్నారు. యువత ఆత్మహత్యల కారణంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయితే, ఆ తర్వాత కుటుంబపాలన నడుస్తోందన్నారు. బంగారు తెలంగాణ కాస్తా.. కంగారు తెలంగాణగా మారిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవడమే ప్రయార్టీగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదన్నారు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక శాఖలకు అధికారులు లేరన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తుండగా.. నిజాయితీ గల అధికారులు మౌనంగా ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఆత్మ సంతృప్తి ఉండాలి. కానీ, ఇక్కడ అసంతృప్తి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. అధికారులపై కులం, మతం, డబ్బు ప్రభావం, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయన్నారు.

తాను జీవనోపాధి కోసం ఉద్యోగంలోకి రాలేదని కేవలం సేవాభావంతోనే పోలీస్ అయినట్టు చెప్పారు. పోలీస్ విభాగంలో సంస్కరణలను మెదక్‌లో ఉండగా ప్రారంభించినట్టు తెలిపారు. పోలీస్ ట్రైనింగ్‌లో సమూల మార్పులు కావాలని కోరుకున్నట్టు తెలిపారు. నేను వీఆర్ఎస్ పొందేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తే.. దానిని రద్దు చేయడమే కాకుండా, నన్ను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పారు. తనకు ఛార్జ్‌మెమో ఇచ్చిందన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి అనేక లేఖలు రాశానని వెల్లడించారు. అనంతరం పంజాబ్ ప్రభుత్వం నన్ను సలహాదారుగా నియామకం చేసినా, నాకు పంజాబ్ వెళ్లడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అదే పని ఇక్కడ చేస్తానంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తనకు సీఎంతో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌లాగా ఎలాంటి పదవులు లేకున్నా.. నేను ఇక్కడే ఉండి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ప్రకటించారు. మరో 15 రోజుల్లో భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తానన్నారు. అనంతరం ఊరూరూ తిరుగుతానని వెల్లడించారు.



Next Story