మందకృష్ణ మాదిగను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

by  |
Chandrababu
X

దిశ, అంబర్‌పేట్: ఇటీవల మోకాలు శస్త్రచికిత్స చేసుకొని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించిందని తెలిపారు. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం అన్నారు. నేరాలు, ఘోరాలు చేసే అలవాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచే అలవాటని ఎద్దేవా చేశారు. 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో దాడులు చేయాలనే ఆలోచన టీడీపీకి రాలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని వెల్లడించారు. రాజకీయ అవసరాల కోసం ఇబ్బందులు పెడుతున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఈ పరామర్శలో మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed