అమెరికా పాఠ్యపుస్తకాల్లో మనోడు!

by  |
అమెరికా పాఠ్యపుస్తకాల్లో మనోడు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ అటవీ మనిషిగా పేరు సంపాదించుకున్న జాదవ్ పాయేంగ్ గురించి అమెరికా విద్యార్థులు ఇకపై తమ పాఠ్యపుస్తకాల్లో చదువుకోనున్నారు. నాలుగు దశాబ్దాలపాటు ఒక్కడే కష్టపడి 550 ఎకరాల బీడు భూమిని అందమైన అడవిగా మార్చి ఘనత సాధించిన పాయేంగ్ గురించి బ్రిస్టల్ కనెక్టికట్‌లో గ్రీనే హిల్స్ స్కూల్‌లోని ఆరో తరగతి విద్యార్థులు చదువుకోబోతున్నారు. 57 ఏళ్ల ఈ అస్సామీ రైతు సాధించిన ఎన్నో ఘనతల్లో ఇది గొప్పగా నిలవనుంది. ఎకాలజీ పాఠ్యాంశాల్లో భాగంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినినిచ్చేందుకు జాదవ్ పాయేంగ్ గురించి చేర్చినట్లు గ్రీనే హిల్స్ స్కూల్ టీచర్ నవమీ శర్మ తెలిపారు.

అసలైన సంకల్పం, దృఢ నిశ్చయం ఉంటే ప్రపంచాన్ని మార్చడానికి ఒంటరిగానైనా ప్రయత్నించవచ్చని నిరూపించిన జాదవ్ గురించి రేపటి పౌరులకు తెలియాల్సిన అవసరం ఉంది. తూర్పు అస్సాంలోని మాజులీ ద్వీపం క్రమక్షయాన్ని తగ్గించడానికి ఆ చుట్టుపక్కల ఉన్న బీడు భూమిని దట్టమైన అరణ్యంగా మలిచాడు. ఇప్పుడు ఆ అడవిలో ఏనుగులు, జింకలు, ఖడ్గమృగాలు, పులులు, ఇంకా ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. పాయేంగ్ చేసిన గొప్ప పనులు ప్రపంచానికి తెలియడం నిజంగా హర్షణీయమని స్థానిక ఇండియన్స్ కొనియాడారు.

Next Story

Most Viewed