‘మహిళలపై కేసులు పెట్టడం దుర్మార్గం’

by  |
tribal leaders
X

దిశ, అచ్చంపేట: అటవీ భూములకు పట్టాలు ఇవ్వకుండా, చెంచు గిరిజన తెగకు చెందిన గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి, అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయడం మంచిది కాదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ అన్నారు. గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ, చెంచు తండాల్లో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ హక్కుల చట్టం అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కుల చట్టం కింద 60 రోజుల్లో పట్టాలివ్వాలని ఉన్నా ఆచరణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమడ దూరంలో ఉందని అన్నారు. ఈ చట్టం ప్రకారం.. గిరిజనులు ఎక్కడైతే భూమి సాగుచేస్తున్నారో ఒక్కటి నుండి పది ఎకరాల వరకు సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలి అని చెబుతున్నదని గుర్తుచేశారు.

అనంతరం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పట్టాలివ్వకుండా.. అక్రమ కేసులు నమోదు చేసి మహిళలని చూడకుండా జైలుకు పంపడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. మాచారం చెంచుల పట్ల ఐటీడీఏ పీఓ స్పందించి ఆదివాసుల తరపున లాయర్లను నియమించి బెయిల్ పిటిషన్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. రెండు, మూడ్రోజుల్లో అధికారులు స్పందించకపోతే చెంచులతో కలిసి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తానని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం.శంకర్ నాయక్, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ మండల కార్యదర్శి పేర్ముల గోపాల్, ఉప్పు నుంతల మండల కార్యదర్శి కేసు మల్ల సైదులు, భూమి లబ్ధిదారులు లింగమ్మ, సుప్రియా, పార్వతమ్మ, లక్ష్మమ్మ, సైదులు, కృష్ణ, రాములు, పాల్గొన్నారు.

Next Story

Most Viewed