గల్ఫ్ కార్మికులపై విదేశీ జర్నలిస్టుల స్పెషల్ ఫోకస్.. 

by  |
గల్ఫ్ కార్మికులపై విదేశీ జర్నలిస్టుల స్పెషల్ ఫోకస్.. 
X

దిశ, జగిత్యాల : గల్ఫ్ కంట్రీల్లో మగ్గిపోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల వ్యథలను తెలుసుకునేందుకు విదేశీ జర్నలిస్టులు మల్లాపూర్ మండలం ముత్యంపేటకు విచ్చేశారు. వలస కార్మికుల ఆర్థిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు సోమవారం గ్రామాన్ని సందర్శించారు. నెదర్లాండ్స్‌కు చెందిన జర్నలిస్ట్ ఈవా ఔడె ఎల్ఫెరింక్, బ్రిటిష్ ఫోటో జర్నలిస్ట్ రెబెక్కా కాన్వేలు హైదరాబాద్‌కు చెందిన అనువాదకురాలు ప్రియాంక బృందానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సంధానకర్తగా, గైడ్‌గా వ్యవహరించారు. డచ్ జాతీయ దినపత్రిక ‘ఎన్నార్సీ హ్యాండిల్స్ బ్లాడ్’ కొరకు వీరంతా వలస కార్మికుల సమాచారాన్ని సేకరించారు.

2019 సెప్టెంబర్ 29న ఖతార్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ముత్యంపేట గ్రామానికి చెందిన కార్పెంటర్ మండలోజి రాజేంద్ర ప్రభు (41) కుటుంబ సభ్యులను జర్నలిస్టుల బృందం పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య సుచరిత, ఇద్దరు కూతుళ్లు నందిని (12), లాస్య (6) ఉన్నారు. అనంతరం గల్ఫ్ దేశాల నుండి తిరిగొచ్చిన ముత్యంపేటకు చెందిన వలస కార్మికులు ఏశాల సాగర్, మండ రాము, చింతపల్లి వెంకట రమణ, అంతుల గోవర్థన్, లవ కుమార్‌లను జర్నలిస్టులు కలిసి వారి వలస అనుభవాలను తెలుసుకున్నారు. గల్ఫ్‌లో మరణాలు, పాస్ పోర్టులు తీసుకొని యాజమానులు వేధింపులకు గురిచేయడం, వేతన దొంగతనము, వీసా చార్జీల పేరిట అక్రమ వసూళ్లు, అరబిక్ భాషా సమస్య, తక్కువ వేతనం ఎక్కువ పని లాంటి విషయాలపై ఆరా తీశారు. గ్రామ ఉప సర్పంచ్ అల్లూరి మహేశ్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది శఠగోప శ్రీనివాస్, గ్రామ పెద్దలు నిమ్మల నాగయ్య, జిన్న గుండి రాము, వాకిటి ఆనంద్ రెడ్డి‌లు దగ్గరుండి జర్నలిస్టులకు సహకరించారు.


Next Story