భారత్‌లో కార్యకలాపాలు మూసేయనున్న ఫోర్డ్ మోటార్

by  |
భారత్‌లో కార్యకలాపాలు మూసేయనున్న ఫోర్డ్ మోటార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ భారత్‌లో తన తయారీ కార్యకలాపాలను మూసేయాలనుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి తన మూడు తయారీ ప్లాంట్లను నిలిపేయనున్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఈ కార్ల తయారీ దిగ్గజం దేశీయంగా కాంట్రాక్ట్ తయారీ లేదంటే కర్మాగారాల అమ్మకం కోసం ఇతర కార్ల కంపెనీలతో చర్చలు జరుపుతోంది. తాజాగా ఓలా తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఫోర్డ్ కార్మాగారాలను ఉపయోగించనున్నట్టు సమాచారం. అయితే, ఇవి ఒట్టి ఊహాజనిత వార్తలే అని, ఇలాంటి వాటిపై స్పందించడం ఇష్టం లేదని ఫోర్డ్ ఇండియా ప్రతినిధి ఒకరు అన్నారు.

భారత్‌లో కంపెనీ మూలధన కేటాయింపులను అంచనా వేస్తున్నామని, ఈ ఏడాది రెండో భాగంలో దీనిపై స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. మహీంద్రా కంపెనీతో సైతం చర్చలు తీవ్రంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎంఅండ్ఎంతో చర్చలు విరమించుకున్న తర్వాత ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్ కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రక్రియను కొనసాగించింది. ‘ఆటో పరిశ్రమ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల్లో అనిశ్చితితో పాటు ఫోర్డ్ కంపెనీకి సామర్థ్య వినియోగం సహా అనేక తీవ్రమైన సవాళ్లు ఎదురవడంతో భారత్‌లో కొనసాగడం సమస్యగా మారిందని’ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Next Story

Most Viewed